ప్రజలందరి బాగోగులను పట్టించుకోవటం ఆదర్శ పాలకుడి విధి అని నైతిక గ్రంథాలు, వివిధ మతాలు ఉద్బోధిస్తుంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఈ బోధన చూపిన మార్గంలోనే ఉన్నాయి. తల్లిదండ్రులను కోల్పో యి దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారుల నుంచి జీవితం మలిసంధ్యలో ఉన్న వృద్ధుల వరకూ వివిధ వర్గాల ప్రజల కోసం క్యాబినెట్ వెలువరించిన నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తు న్న ప్రాధాన్యానికి అద్దం పట్టాయి. స్వరాష్ట్రంగా అవతరించిన తరువాత ఏడేండ్లుగా కొనసాగుతున్న మానవీయ విధానాలకు ఇవి కొనసాగింపు. కరోనా కారణంగా ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా వెరువక, ప్రజా సంక్షేమమే పరమావధిగా తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకం.
రైతులకు రూ.50 వేల వరకూ వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. రూ.50 వేల లోపు రుణాలు తీసుకునేది అత్యధికంగా చిన్న, సన్న కారు రైతులే. దీనివల్ల దాదాపు 6 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. గతేడాది జరిగిన రూ.25 వేల లోపు రుణాల మాఫీ కింద 3 లక్షల మంది రైతన్నలు ప్రయోజనం పొందారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి హయాంలో అమలైన రూ.లక్ష రుణమాఫీ పథకం కింద 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు సంక్షేమ విధానాల మూలంగా వ్యవసాయ సంక్షోభం సమసిపోయింది. అయినా రైతులు నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ రుణమాఫీ మళ్లీ చేస్తున్నారు.
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేయటం కూడా హర్షణీయమే. అనాథలు ఇక నుంచి శ్రీనాథులని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. కరోనా నేపథ్యంలో అనాథలను ఆదుకోవడంపై ఆయన మరింత శ్రద్ధ వహిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ప్రభుత్వమే అండగా ఉం డాలని, ఆ బాలల స్థితిగతులను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని పలువురు మంత్రులతో ఒక సబ్కమిటీని ఏర్పాటు చేశా రు. దోభీఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటు ఇవ్వడం వల్ల ఆయా వర్గాలకు చేయూతనిచ్చినట్టవుతున్నది. దళితబంధు పథకాన్ని విజయవంతం చేయాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10 శాతం రిజర్వేషన్, గరిష్ఠ వయోపరిమితిలో ఐదేండ్ల సడలింపుని వ్వాలని, వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేలా ఏడు వైద్య కళాశాలలు నెలకొల్పాలనీ క్యాబినెట్ నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ నిర్దిష్ట అజెండాతో వ్యవహరిస్తున్నారు. తాజా నిర్ణయాలు కూడా ఈ సమ గ్ర అభివృద్ధి వ్యూహంలో భాగమే.