ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం టాటాలకు అప్పగించడం దాదాపుగా ఖరారయింది. ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఈ విమానయాన సంస్థ ఎప్పుడో ఒకప్పుడు ప్రైవేటు చేతిలో పడుతుందనేది ఊహించిందే. అయితే దీనిని మరే దేశవిదేశ కంపెనీకో అప్పగించకుండా టాటా సంస్థకు కట్టబెట్టడం మాత్రం సముచిత నిర్ణయంగానే భావించవచ్చు. ఈ నేపథ్యంలో, గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు అభిలషణీయమా అనే చర్చ మరోసారి ముందుకు వస్తున్నది. ప్రైవేటీకరణ ప్రారంభమైన తరువాత ఇటీవలి కొన్ని దశాబ్దాలలో మనకు ఎదురైన అనుభవాలను సమీక్షించుకోవడం అవసరం. ప్రపంచవ్యాప్త అనుభవాలను కూడా గమనంలోకి తీసుకోవాలి.
సామ్యవాద దేశాల్లోని అనుభవాలను, పూర్తి పెట్టుబడిదారీ దేశాలలోని ఇబ్బందులను అర్థం చేసుకొని మన దేశం మొదటి నుంచి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటీకరణ ప్రారంభమైన తరువాత పనిగట్టుకొని పబ్లిక్ రంగ సంస్థలను అమ్మివేయడం మొదలైంది. పబ్లిక్రంగ సంస్థల నిర్వహణ లోపం, నష్టాలను ప్రభుత్వం ప్రైవేటీకరణకు కారణంగా చూపింది. కానీ ప్రైవేటుకు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్న తరువాతనే, విధానపరమైన లోపాల వల్ల కొన్ని సంస్థలు నష్టాల పాలయ్యాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని చిత్తశుద్ధితో చక్కదిద్దితే లాభాల బాట పడుతాయి. కానీ ‘లాభాల ప్రైవేటీకరణ, నష్టాల జాతీయీకరణ’ అనే విధానాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అనుసరించిందనవచ్చు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం రైల్వేలు మొదలుకొని పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు దత్తం చేయడానికి సిద్ధపడుతున్నది. దేశ ప్రజలకు జీవితబీమా అంటే ఏమిటో తెలియజేసిన ఎల్ఐసీని కూడా వదిలించుకోవటానికి ఉత్సాహపడుతున్నది. కోట్లాదిమంది జీవితాలతో పెనవేసుకొన్న ఎల్ఐసీ లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న అత్యంత భారీ బీమా సంస్థ. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కూడా ఈ సంస్థ పాత్ర గణనీయమైనది. కేంద్రం పబ్లిక్రంగ సంస్థల లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రైవేటీకరణే లక్ష్యంగా సాగుతున్నదనేది స్పష్టం.
ఉచితానుచితాలు మరిచి ప్రైవేటీకరించడం సమర్థనీయం కాదు. అయితే ఎయిర్ ఇండియాను ఎలాగూ ప్రైవేటుకు అప్పగిస్తున్న నేపథ్యంలో అది టాటాలకు దక్కడం హర్షణీయమే. 1932లో జేఆర్డీ టాటా స్థాపించిన టాటా ఏవియేషన్ సర్వీస్ను కేంద్రప్రభుత్వం జాతీయీకరణలో భాగంగా స్వాధీనం చేసుకున్నది. జాతీయీకరణ తరువాత కూడా టాటాయే దీనికి చైర్మన్గా నియమితులయ్యారు. అంతర్జాతీయ శ్రేణి సంస్థగా ఆయన ఎయిర్ ఇండియాను తీర్చిదిద్దారు. 1970 దశకంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనను ఎయిర్ ఇండియా సారథ్యం నుంచి తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఎయిర్ ఇండియా టాటాల గూటికే చేరటం విశేషం.