‘అతిరథులందు మీదెరిగి నట్టి మనీషివి, స్వీయ చింతనా/ యత కృతశాసనుండవు, మితాక్షర మంత్రయుతుండవో మహా/ మతి! నరసింహ! నీదయిన మానస మెట్టిదొ కాని మాట సు/ న్నిత మివియే ప్రధానముగ నిన్ను ప్రధానిగ జేసియుండెడిన్’ అంటూ పీవీ నరసింహారావు వ్యక్తిత్వాన్ని తన పద్యమణి కాంతులతో సాక్షాత్కరింపజేశారు ప్రముఖ కవి ఉత్పల సత్యనారాయణాచార్య. దేశ నాయకుడిగా ఎదిగి, తన పాలనా పటిమతో అంతర్జాతీయ సమాజాన్ని అచ్చెరు వొందించిన తెలంగాణ భూమి పుత్రు డు పీవీ నరసింహారావు శత జయంత్యుత్సవాలను ఏడాది పొడుగునా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం అభినందనీయం. శత జయంత్యుత్సవాలతో సరిపెట్టకుండా, ఆ మహనీయుడి జ్ఞాపకాలను పదిలపరచడంతోపాటు ఆయన బహుముఖ జీవిత కోణాలపై పరిశోధనలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున భారీ పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతోపాటు నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ అని ఆయన పేరు పెట్టింది.
నెహ్రూ కుటుంబానికి చెందని నాయకుడు దక్షిణాది నుంచి ప్రధాని పీఠాన్ని అధిరోహించడమే అపూర్వమైతే, ఐదేండ్లు నిశ్చలం గా పరిపాలించడమూ, దేశ రాజకీయార్థిక గతిని మార్చడం నాటి పరిస్థితుల్లో అనూహ్యం, అసాధారణం. ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధాని పదవి వరకు ఏ పదవిలో ఉన్నా సంస్కరణలు చేపట్టారు. అతడి పరిపాలనా ప్రభావం పడని రంగమంటూ లేదు. నేటికీ ఆయన మార్గమే ఆచరణీయమైంది. ఆ మహానాయకుడి సేవ లు గుర్తించి ప్రశంసించడానికి బదులు అవమానాలు పాలు చేయ డం మరిచిపోలేని విషాదం. ‘తావక నిష్కళంక చరితంబు మత్సరులెంత నీచ దుర్భావము లంటగట్టుటకు పాల్పడినన్ సయిరించినావు, నీవే విజయుండవైతివి.. ’ అన్నట్టు దుర్మతులు ఎంత బురద జల్లినా చివరికి ఆయన ఆ అపవాదుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడ్డారు.
పీవీకి జాతీయస్థాయిలో జరిగిన వివక్ష నేపథ్యంలోనే, తెలంగాణ ప్రభుత్వం ‘పీవీ మన ఠీవీ’ అంటూ ఆయన శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించింది. జాతీయపార్టీలకు తమ బాధ్యతను గుర్తుచేసింది. పీవీని స్మరించకపోతే అపహాస్యం పాలవుతామని భయపడిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జాతీయస్థా యి పెద్దల అనుమతితో మొక్కుబడి కార్యక్రమాలు జరపబోయి మరింత అభా సుపాలయ్యారు. పీవీని అవమానించిన చరిత్ర కాంగ్రెస్దైతే, ప్రస్తు తం అధికారంలో ఉండీ ఉపేక్షించడం ఎన్డీయే పెద్దల వంతయింది. కేంద్ర పాలకులు ఇప్పటికైనా మేలుకొని పీవీకి జరిగిన అన్యాయా న్ని చక్కదిద్దాలె. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టుగా పీవీకి భారతరత్న ప్రకటించడంతోపాటు పార్లమెంటులో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించాలి.