హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి మరికాసేపట్లో సీఎం కేసీఆర్ బయల్దేరనున్నారు. రోడ్డుమార్గంలో మధ్యాహ్నం వేళ గ్రామానికి చేరుకోనున్న సీఎం 3వేల మంది గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లుచేశారు. అనంతరం గ్రామస్థులతో సమావేశంలో పాల్గొననున్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం వాసాలమర్రిని సందర్శించి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు. సీఎం పాల్గొనే కార్యక్రమాల్లో కేవలం వాసాలమర్రి గ్రామస్తులే పాల్గొనేలా ప్రత్యేకంగా పాస్లను జారీచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ వస్తుండటంతో వాసాలమర్రి వాసులు సంబురపడిపోతున్నారు.