జోన్ ఏర్పాటుకు భూ సేకరణ పూర్తి
జింకల తండా వద్ద 157 ఎకరాల భూమి ఖరారు
పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగింత
ఇక నిర్మాణ పనులే తరువాయి..
ఖమ్మం, జూన్ 18 : (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జిల్లా అధికారులు 157 ఎకరాల అనువైన స్థలాన్ని సేకరించారు. రఘునాథపాలెం మండలం జింకలతండా ప్రభుత్వ భూమి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు అన్ని రకాలుగా అనువుగా ఉంటుందని భావించిన అధికారులు వారం రోజులపాటు భూమిని సర్వే చేసి రికార్డులను సిద్ధం చేశారు. 100 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఈ ప్రాంతంలో లభిస్తుందని అధికారులు భావించినా.. సర్వే అనంతరం 157 ఎకరాల భూమి లభ్యమైంది. దీంతో ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కానుంది. సుమారు రూ.200 కోట్లకుపైగా పెట్టుబడితో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
రూ.200 కోట్లు విలువ చేసే పరిశ్రమలు
ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు నూతనంగా ఏర్పాటు అయ్యే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో పార్ బాయిల్డ్ రైస్మిల్లు, రా రైస్ మిల్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపారు. పలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో కల్పించే మౌలిక వసతులపై పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పార్ బాయిల్డ్ రైస్ మిల్లు ఏర్పాటు చేయడానికి కనీసం రూ.10 కోట్లు పెట్టుబడికి అవసరం కానున్నది. రా రైస్ మిల్లు ఏర్పాటుకు రూ.6 నుంచి 10 కోట్లు అవసరం కానున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు పూర్తి అయితే ఖమ్మం జిల్లాకు దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే పరిశ్రమలు తరలొచ్చే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు ఉపాధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నది. జిల్లాలో సాగునీటి వనరుల లభ్యత పెరిగి ధాన్యం ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా బాయిల్డ్, రా రైస్ మిల్లులను త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాల్సిన అవశ్యకతను గుర్తించారు. కొత్తగా జిల్లాకు మంజూరైన ఫుడ్ ప్రాసెసింగ్లో బాయిల్డ్ రైస్ మిల్లు, రా రైస్ మిల్లు నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి కనబరిచే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని, ఫుడ్ప్రాసెసింగ్ నిర్మాణం పూర్తి అయితే అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నది. కోట్లాది రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపన జరుగుతుండడంతో ఆయా పరిశ్రమల అనుబంధ వ్యాపార సంస్థలు ఏర్పాటు కానున్నాయి.
సర్వే చేస్తున్నాం..
ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ నిర్మాణానికి అవసరమైన, అనువైన 157 ఎకరాల భూమిని ఖమ్మం జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు సేకరించాం. సేకరించిన భూమిని నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాల సంస్థ అధికారులకు అప్పగించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ పూర్తి కావడంతో పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ నిర్మాణ పనులపై దృష్టిసారించనుంది.