కథలాపూర్, జూన్ 18 : వేములవాడ నియోజకవర్గానికి చెందిన కథలాపూర్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు శుక్రవారం మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతి భవన్లో మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచనల మేరకు కథలాపూర్ మండలం గంభీర్పూర్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ను కోరారు. గంభీర్పూర్ గ్రామంలో 344 ఎకరాల ప్రభుత్వ భూమిలో మామిడి, పసుపు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని, దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా అందుబాటులో ఉన్న మామిడి, పసుపు పంటలకు సంబంధించిన రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జగిత్యాల జిల్లాలో 36 వేల ఎకరాల్లో మామిడి సాగవుతున్నదని, తెలంగాణలోనే మామిడిలో జిల్లా మొదటి స్థానం, పసుపు 22 వేల ఎకరాల్లో సాగవుతూ రెండో స్థానంలో ఉందన్నారు.
ఈ రెండు ప్రధాన పంటల ప్రాసెసింగ్, శుద్ధి మన ప్రాంతంలోనే జరిగితే రైతులకు గిట్టుబాటు ధర, ఆదాయానికి భరోసాతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనపైన సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్కుమార్ను కలిసి మండలంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. మంత్రి కేటీఆర్కు ఈ సందర్భంగా మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్రావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బొడ్డు బాలు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎంజీ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు దాసరి గంగాధర్, చుక్క దేవరాజం, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.