మల్కాజిగిరి, జూన్ 15:నగరంలో మరోసారి ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి పర్యటించారు. ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లోని పీవీఎన్ కాలనీ సేంట్ఆన్స్ కళాశాల వద్ద రూ .50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బాక్స్ డ్రైన్ పనులను స్థానిక కార్పొరేటర్ వై. ప్రేంకుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె పీవీఎన్ కాలనీ నుంచి లాలాపేట వరకు గల ప్రధాన నాలాలను పరిశీలించారు. ప్రతిరోజు రెండు గంటల పాటు స్థానిక కార్పొరేటర్లు వారివారి డివిజన్ల పరిధిలోని శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని కోరారు.
వర్షాకాలంలో వరదనుంచి విముక్తి కోసం ఆరు డివిజన్లలోని స్ట్రాం వాటర్ డ్రైనేజీ పనులను రూ.18 కోట్లతో యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ వరదముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి లోతట్టు బాక్స్ డ్రైనేజీలతో పాటు వరదమళ్లింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డి, సునీతాచంద్రశేఖర్ యాదవ్, క్యానం రాజ్యలక్ష్మి, ప్రేంకుమార్, ఊరపల్లి శ్రావణ్కుమార్, మేకల సునీతారాముయాదవ్, రాజ్ జితేంద్రనాథ్, జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీసీ దశరథ, ఎస్ఈ అనిల్రాజ్, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, నాయకులు బద్దం పరుశరాంరెడ్డి, పిట్టల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్కుమార్, ఉపేందర్రెడ్డి, బాబు, సత్యనారాయణ, ఎస్ఆర్ ప్రసాద్లతో పాటు పలువురు పాల్గొన్నారు.