హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వరంగల్లోని పాత జైలు స్థలంలో నిర్మించనున్న మల్టీలెవల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. అదేరోజు వరంగల్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. వరంగల్లోని దవాఖానను దేశంలోనే అద్భుతమైన మల్టీలెవల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానగా మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని ప్రకటించారు. 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాంకేతిక హంగులతో గ్రీన్బిల్డింగ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అత్యవసర చికిత్సకు వచ్చే పేషెంట్లకోసం దవాఖాన భవనంపై హెలికాప్టర్ దిగేలా హెలీపాడ్ను కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు. కెనడాలోని దవాఖానల తరహాలో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్ వెంటిలేషన్ పద్ధతుల్లో నిర్మాణం ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం కెనడా పర్యటించి రావాలని సూచించారు. కరోనాలాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తామని చెప్పారు. ఇటీవలే 7 మెడికల్, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసినట్టు వివరించారు.
వైద్య ఆరోగ్యశాఖ నివేదిక
సీజనల్ వ్యాధులు, అవి సంక్రమించేతీరు, నివారణకోసం చేపట్టాల్సిన చర్యలను వైద్యోరోగ్యశాఖ అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. మలేరియా తదితర సీజనల్ వ్యాధుల కట్టడిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా వైరల్, సీజనల్ వ్యాధులను గణనీయంగా అరికట్టగలిగామని, అందుకు సంబంధించిన గణాంకాలతో కూడిన నివేదికను చదివి వినిపించారు. మలేరియాలో ప్రి ఎలిమినేషన్ దశనుంచి ఎలిమినేషన్ (నిర్మూలన) దశకు చేరుకున్నామని తెలిపారు. మరో మూడేండ్లు ఇదే పద్ధతులను అవలంబిస్తే శ్రీలంక తరహాలో మలేరియా రహితరాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని.. కరతాళ ధ్వనుల మధ్య పంచాయతీరాజ్, మున్సిపల్శాఖలను సమావేశం అభినందించింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి గొప్పగా పనిచేస్తున్నయి. అయితే ప్రతిసారి సీజన్ ప్రారంభానికి ముందే వైద్యశాఖ అధికారులు అటు పంచాయితీరాజ్, ఇటు మున్సిపల్శాఖ అధికారులతో చర్చించి వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఈ విధానాన్ని ఒకపని సంస్కృతిగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం విషయంలో అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సూచించారు. బస్తీ దవాఖానలు బాగా పనిచేస్తున్నాయని అభినందించారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 29 నుంచి 55 శాతానికి పెరిగాయని చెప్పారు.