న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య రహస్య స్నేహం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సామర్ధ్య గ్రేడింగ్ సూచీ (పీజీఐ)లో పంజాబ్ తొలి ర్యాంక్ లో నిలిచిన క్రమంలో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ లో ప్రభుత్వ పాఠశాలలు దయనీయంగా ఉంటే అమరీందర్ సింగ్ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు పంజాబ్ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయని ప్రధాని నివేదిక ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇరువురు నేతల మధ్య దోస్తీని ఇది వెల్లడిస్తోందని వ్యాఖ్యానించారు.
గత రెండు మూడేండ్లలో కెప్టెన్ సింగ్ పంజాబ్ లో 800 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, మిగిలిన స్కూళ్లను ప్రైవేటు రంగానికి కట్టబెట్టారని సిసోడియా పేర్కొన్నారు. ఓ స్కూల్ లో మద్యం ఫ్యాక్టరీ నడుపుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ఇది నిదర్శనమని అన్నారు. పంజాబ్ ప్రభుత్వ పాఠశాలలను మెరుగ్గా నడుపుతున్నారని ప్రధాని మోదీ కెప్టెన్ సాబ్ ను మెచ్చుకుంటున్నారని సిసోడియా విమర్శించారు.