హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ పార్టీపై చేసిన ఆరోపణలు అసందర్భం, అనాలోచితమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఒకవైపు తాను వామపక్ష, లౌకికవాదినని చెప్పుకొంటూ, పచ్చి మతోన్మాత ఫాసిస్టు బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతోనే ఈటల వైఖరి అర్థమవుతున్నదని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. అసైన్డ్ భూములను ఎవరు కొనుగోలు చేసినా వాటిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేయడమే సమంజసమని హితవు చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ తన తండ్రి కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. శనివారం చాడ వెంకటరెడ్డి జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, సీపీఐ ఎన్నికల్లో పోటీ చేయాలో? వద్దో? ఎవరు నిర్ణయిస్తారో తెలుసంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, పూర్తిగా నిరాధారమైనవని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ అయిన సీపీఐ ఎవరి మార్గదర్శనాలకు, వ్యక్తుల ప్రమేయాలకు అనుగుణంగా నడవదని స్పష్టంచేశారు. ఈటల తన ఉనికి కోసమే బీజేపీలో చేరుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీఆర్ఎస్, సీపీఐ మధ్య రాజకీయంగా ఎన్నడూ చర్చ జరగలేదని తెలిపారు.
తమ ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ మార్గదర్శనం ప్రకారం పనిచేస్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టంచేశారు. తాము టీఆర్ఎస్ను లౌకిక పార్టీగానే చూస్తున్నామని, ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని ఓడించే లౌకిక పార్టీల్లో బలమైన పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియంతృత్వ, ప్రజా వ్యతిరేక విధానాలతో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని, వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో ఈటల కూడా ఈ చట్టాలు రైతు వ్యతిరేకమన్నారని గుర్తుచేశారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భూములన్నిటినీ డిజిటల్ సర్వే చేపట్టే ముందే విధి విధానాలు రూపొందించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వానికి చాడ విజ్ఞప్తి చేశారు.