నగరం, పట్టణాల్లో పలు వీధులు జలమయం
ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు
వరంగల్, జూన్ 3: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. మొన్నటివరకు ఉక్కబోతతో అల్లాడిన జనం తొలకరి చినుకుతో పరవశించి పోయారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అర్బన్ ప్రాంతంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వర్షం పడడంతో రైతన్నలు దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధవుతున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు
అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో వరంగల్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. హంటర్రోడ్లోని ఎన్టీఆర్నగర్, సంతోషిమాతా కాలనీల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచింది. లాక్డౌన్ సడలింపు సమయంలో వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటికి వచ్చిన వారు వర్షంలో తడిసి ముద్దయ్యారు.
మహబూబాబాద్లో జోరువాన
మహబూబాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో జోరువాన కురిసింది. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన వాన ఎడతెరిపి లేకుండా కురిసింది. జిల్లాకేంద్రంతో పాటు బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం, కేసముద్రం, నెల్లికుదురు, తొర్రూరు, నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు, కురవి, డోర్నకల్, పెద్దవంగర మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ సమీపంలో వరదనీరు భారీగా వచ్చి చేరింది. దీంతో రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే చిరురైతుల కూరగాయలు నీట మునిగాయి. జిల్లావ్యాప్తంగా వాన భారీగా కురవడంతో రైతులు వానకాలం పంటసాగుకు సిద్ధమయ్యారు.