ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్ల లో 60 ఏండ్ల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగం, సంక్షేమం వంటి అన్నిరంగాల్లో రాష్ట్రం దేశంలో మొదటిస్థానంలో ఉండే దిశగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, ఉద్యమంలో చైతన్యాన్ని ప్రదర్శించారని ఆమె గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అద్భుతంగా సమపాళ్లలో అమలుచేస్తున్న నాయకులపై నిరంతరం విశ్వసనీయతను ప్రదర్శిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ను బలంగా నిలబెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అభివృద్ధి ఎలా జరిగిందో, ఇకముందు ఇంకా పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఆమె విశ్వసించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న వీరుల ఆశయాలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
గవర్నర్కు కవిత జన్మదిన శుభాకాంక్షలు
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కూడా గవర్నర్కు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేశారు.