నిజామాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారితో పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైరస్ బారి నుంచి బయటపడేందుకు పోరాడుతున్నారు. విపత్కర పరిస్థితిలో పూట గడవడమే కష్టంగా మారింది. అలాంటి వారికోం నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఉచిత అన్నదానం ప్రారంభించారు. కరోనా చికిత్స తీసుకుంటున్న వారు, స్వీయ నిర్బంధంలో ఉన్న వారు, ఆకలితో బాధ పడుతున్న ఎవరైనా సరే ఎమ్మెల్యే ఏర్పాటుచేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే చాలు.. వారి ఇంటికే ఆహార పొట్లాలు చేరతాయి. గత 27 రోజులుగా 40 వేల మందికి కడుపు నింపి దాతృత్వాన్ని చాటుకున్నారు.
పేదలకు అండగా ఉండాలని..
ఏడాది కాలంగా కరోనాతో ఇబ్బంది పడుతున్న పేదలకు అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఎంతో సాయంచేశారు. తన తండ్రి కృష్ణమూర్తి పేరిట సోదరుడు బిగాల మహేశ్గుప్తా, కుటుంబీకుల సహకారంతో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. గత మే 7వ తేదీన నగరంలో ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరు ప్రత్యే క వాహనాలను ఏర్పాటుచేసి స్థానిక వినాయక్నగర్, వర్ని చౌరస్తా, నెహ్రూ పార్క్, ఖలీల్ వాడి, హమాల్వాడి, కంఠేశ్వర్, శాంతినగర్, మాలపల్లి, బాబాన్సాబ్ పహా డ్, పెయింటర్ కాలనీల్లో తిరుగుతూ అన్నదానం చేస్తున్నారు. అనంతరం భోజనం కో సం కాల్ సెంటర్కు వచ్చే విజ్ఞప్తుల మేరకు వలంటీర్లు బాధితుల ఇంటికెళ్లి ఆహార పొట్లాలను అందజేస్తారు. ప్రతిరోజు మధ్యా హ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజనం సమకూరుస్తున్నారు. ఇందుకోసం రోజు 75 మంది సిబ్బంది పని చేస్తున్నారు. నిత్యం 1500 నుంచి 1800 మందికి భోజనాన్ని అందజేస్తున్నారు. కరోనా చికిత్స నిమిత్తం నగరానికి వచ్చే నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లావాసులతో పాటుగా మహారాష్ట్ర ప్రజలకు ఉచిత భోజనం అందుతున్నది.
నాన్న స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు
బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలిచేందుకు ఏడాది క్రితమే మా నాన్న కృష్ణమూర్తి కృషిచేశారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన పేరుతోనే సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పేదల ఆకలిని తీర్చడం ద్వారా కలిగే సంతృప్తి అంతాఇంతా కాదు. ఖలీల్వాడి దవాఖాన ఏరియాలో భోజనం స్వీకరిస్తున్న వారిలో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన వారున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వారికి సైతం ఆహారం అందజేస్తున్నం. ఎంతమంది అడిగినా వారి ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం.