న్యూఢిల్లీ: భారత్లో మోడర్నా, ఫైజర్ టీకాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సింగిల్ డోస్ కోవిడ్ టీకా భారత్ లో విడుదల చేయాలని భావిస్తున్న మోడర్నా ఈసరికే సిప్లా తదితర భారతీయ కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించింది. కాగా భారత్కు 2022లో 5 కోట్ల డోసులు పంపిణీ చేయాలని ఫైజర్ భావిస్తున్నది. అయితే నియంత్రణల్లో కొన్ని సడలింపులు కావాలని, నష్టపరిహార నిబంధన కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది. గతవారం రెండుసార్లు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో నీతి ఆయోగ్, బయోటెక్నాలజీ విభాగంతో పాటుగా ఆరోగ్య, న్యాయ, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశానికి తక్షణావసరం దృష్ట్యా స్వదేశీ, విదేశీ మార్కెట్ల నుంచి టీకాలను సేకరించాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనకు కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ అనే రెండు స్వదేశీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 20 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. కొత్తగా రష్యా తయారీ స్పుత్నిక్-వీ అనే మూడో వ్యాక్సిన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని పంపిణీ ప్రస్తుతం తక్కువస్థాయిలో జరుగుతున్నది. ప్రస్తుత టీకాల ఉత్పత్తిలో భారత్కు ఎగుమతి చేసేందుకు మిగులు ఏమీ లేదని మోడర్నా ఇదివరకే తెలియజేసింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని అంటున్నారు.