జీడిమెట్ల, మే 23 : చిన్నతనం నుంచి షుగర్ వ్యాధితో పోరాడుతున్న ఓ మహిళ దాన్ని జయించలేననే భావనతో బలవన్మరణానికి పాల్పడింది. పదిరోజుల అనంతరం విషయం వెలుగులోకి రావడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం సర్కిల్ లాల్సాబ్గూడకు చెందిన యాదయ్య, మన్నెమ్మ దంపతులు. చింతల్ డివిజన్ పరిధిలోని న్యూఎల్బీనగర్లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె మాధవి (33)ఉన్నారు. మాధవి చిన్నతనం నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నది. ప్రతి రోజు రెండు సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటుంది.
తన చిన్నతనం నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి గత పది రోజుల కిందట ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 15న తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్స్టేషన్లో తమ కూతురు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే శనివారం చింతల్ హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతదేహం వద్ద లభించిన లెటర్ ఆధారంగా మృతురాలు మాధవిగా గుర్తించారు.
కాగా మాధవి తన చిన్నతనం నుంచి షుగర్వ్యాధితో బాధపడుతుండటంతో పాటు వయస్సు మీదపడుతున్నా పెండ్లి సంబంధాలు కుదరక పోవడంతో తీవ్రమానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తున్నది. పైగా రోజుకు రెండు పూటలా ఇంజెక్షన్లు తీసుకోవడం కూడా మానసిక స్థితిపై ప్రభావం చూపినట్లు సమాచారం. మాధవి యుక్తవయస్సులో ఉండగా పెండ్లిచేసేందుకు కుటుంబ సభ్యులు మూడు, నాలుగు సంబంధాలు చూశారు. అయితే షుగర్ వ్యాధి కారణంగా సంబంధాలు ఎత్తిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన మాధవి ఇంట్లో ఎవరికి చెప్పకుండా అటవీప్రాంతానికి వెళ్లి ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.