న్యూఢిల్లీ : దేశ రాజధానిని తీవ్రంగా వణికించిన కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగిస్తోంది. మార్చి 31 తర్వాత శనివారం అత్యల్పంగా 2260 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఏప్రిల్ 1 నుంచి రోజువారీ కేసులు 3000 దిగువన నమోదవడం కూడా ఇదే తొలిసారి.ఇక ఏప్రిల్ 22న ఏకంగా 36 శాతంగా నమోదైన కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 3.58 శాతానికి దిగిరావడంతో ఢిల్లీలో కరోనా పరిస్థితి మెరుగైందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
అతితక్కువ కేసులు నమోదవుతున్నా అజాగ్రత్త పనికిరాదని కొవిడ్ నిబంధనలను ప్రజలు పాటించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని నిరోధించేందుకు కఠిన లాక్డౌన్ అమలు చేయడంతోనే కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.