తూప్రాన్ రూరల్, మే 21: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ రైతులకు భరోసా కల్పించారు. తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వడ్ల బస్తాలతో శుక్రవారం నవదుర్గా రైస్మిల్ వద్దకు చేరుకొని తమ ధాన్యాన్ని ముందుగా తీసుకోవాలని రైస్మిల్ నిర్వాహకులతో మొరపెట్టుకోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న వారు సకాలంలో అక్కడికి చేరుకొని రైతులకు రైస్మిల్ నిర్వాహకులకు సర్ధి చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతిగింజనూ ప్రభుత్వమే కొ నుగోలు చేస్తున్నదని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దన్నారు. వర్షం సూచనలు కన్పిస్తుండటంతో ప్రభుత్వం ఆదేశాలతో ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రైవే ట్ గోదాంలను అందుబాటులో ఉంచామని వివరించారు.
ధాన్యం తరలింపునకు వాహనాలు
ధాన్యం తరలింపు కోసం లారీలు లేనందువల్లే నిర్వాహకులతో అద్దె మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించినట్లు రామాయంపేట తహసీల్దార్ శేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రంలు తెలిపారు. శుక్రవారం రామాయంపేట జాతీయ రహదారిపై ఖాళీగా వెళ్తున్న లారీలను పోలీసుల సహాయంతో నిలిపి 3 లారీలు, 2 డీసీఎంలను కొనుగోలు కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కువైతున్నందున లారీలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందు కోసం కిరాయిలు మాట్లాడి ఒక్కరోజు కోసం ఐదు లారీలను తరలించినట్లు తెలిపారు.
ధాన్యాన్ని వెంటనే తరలించాలి :మండల ప్రత్యేకాధికారి దేవయ్య
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని మం డల ప్రత్యేకాధికారి దేవయ్య తహసీల్దార్కు సూచించారు. మండలంలోని చండూర్, చిట్కుల్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం చిట్కుల్ ఐకేపీ గోదాం లో దుంపలకుంట (బాలజీ రైస్ మిల్లు)కు సంబంధించిన ధాన్యం నిల్వను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని రైస్ మిల్లు యజమానులకు ఆయన సూచించారు. ఆయన వెంట సర్పంచ్ గోపాల్రెడ్డి పాల్గొన్నారు.