రీజినల్ సబ్ సెంటర్కు ఆదేశం
నర్సింగ్ కాలేజీకి కూడా ప్రతిపాదనలు..
స్వరాష్ట్రంలో నెరవేరనున్న చిరకాల స్వప్నం
సీఎంకు విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్రావు కృతజ్ఞతలు
నాడు పట్టించుకోని ఉమ్మడి పాలకులు
అదిగో ఇదిగో అంటూ ఏండ్లపాటు దాటవేత
ఓసారి బెల్లంపల్లి, మరోసారి రామకృష్ణాపూర్లో అంటూ కాలయాపన
మంచిర్యాల, మే 17(నమస్తే తెలంగాణ) : మంచి ర్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్లో కొవిడ్పై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిం చారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇందులో భాగంగా మంచిర్యాల లో కొత్తగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే అనుమ తులు వచ్చిన నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదన లను కూడా వెంటనే పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు వెంటనే అందించేందుకు కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా మంచిర్యాలలోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్కు చెన్నూర్ నియోజకవర్గ ప్రజల తరఫున విప్ బాల్క సుమన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. గత అసెంబీ సమావేశాల్లో ఎమ్మెల్యే దివాకర్రావు కూడా మెడికల్ కళాశాల ప్రస్తావన తీసు కొచ్చారు. దివాకర్రావు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
నాడు పట్టించుకోని ఉమ్మడి పాలకులు..
వైద్య కళాశాల కోసం దశాబ్దాలుగా మంచిర్యాల జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో పాలకులు పట్టించుకోలేదు. 1998లో అప్పటి ప్రభుత్వం బెల్లంపల్లి పట్టణానికి మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న కెమికల్ భవన సముదాయ స్థలంలో మెడికల్ కళాశాల భవనం నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాదాపు కోటిన్నరకు పైగా డబ్బులు ఖర్చు చేసి పాత కెమికల్ భవనాన్ని కొత్తదానిలా మార్చారు. కానీ, ఆ తర్వాత వివక్ష కొనసాగింది. అప్పటి పాలకులు దృష్టి పెట్టకపో వడంతో తుది దశలో ఆగిపోయింది. ఫలితంగా ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. ప్రజల నుంచి ఎన్ని డిమాండ్లు వచ్చినా నాటి పాలకులు పట్టించు కోలేదు. ఈ మెడికల్ కళాశాల ఏర్పాటైతే 27 మండలాలకు వైద్యం అందుబాటులో ఉండేది. కానీ, ముఖ్యంగా బెల్లంపల్లిలో ఏర్పాటయ్యే కళాశాల ప్రజా ప్రతినిధుల వల్లే దూరమైంది. మరోవైపు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిని సింగరేణి మెడికల్ కళాశాల చేయాలనే ప్రతిపాదన సైతం ముందుకు వెళ్లలేదు. దశాబ్దాలపాటు డిమాండ్ ఉన్నా నాటి పాలకులెవరూ పట్టించుకోలేదు.