హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్రటరీ, కొవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, టెక్నికల్ అడ్వయిజర్ గంగాధర్ లు పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని, కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సిజన్ తదితరాల కోటాను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో 9213 గా వున్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 20,738కి, ఐసీయూ బెడ్లను 3264 నుంచి 11,274కు ప్రభుత్వం పెంచిందన్నారు. అదేవిధంగా సీఎం ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ డోర్ టు డోర్ కొవిడ్ పీవర్ సర్వేను నిర్వహిస్తున్నదని వివరించారు. అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వారిని గుర్తించి.. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే అడ్డుకోవడం, తద్వారా దవాఖానాలో చేరే పరిస్థితి నుంచి, మరణించే ప్రమాదాల నుంచి కాపాడినట్టవుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల ఇండ్లల్లో కోవిడ్ జ్వర పరీక్షలను నిర్వహించి అనుమానితులను ఐసోలేషన్ లో వుంచి వారికి హెల్త్ కిట్లు అందజేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం తరఫున కేంద్రమంత్రికి మంత్రి హరీష్ రావు పలు విజ్జప్తులను చేశారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కాకుండా, చికిత్స కోసం రాష్ట్రానికి వచ్చే ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకుని, తెలంగాణలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు, ఆక్సిజన్ ఇతరాల కేటాయింపులు జరపాలని మంత్రి కోరారు. తెలంగాణలో మందుల కొరత పెరగడానికి ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రికి హరీష్ రావు వివరించారు. ఆక్సిజన్ సరఫరా, రెమిడిసివర్ ఇంజక్షన్ల కోటాను, వాక్సిన్ల కోటాను పెంచి తక్షణమే సరఫరా చేయాలని కోరారు. ప్రతిరోజు తెలంగాణకు 2 లక్షల టెస్టింగ్ కిట్లు అవసరమున్నపరిస్థితుల్లో వాటిని తక్షణమే సరఫరా చేయాలన్నారు.
రెండో డోస్ కొవిడ్ టీకాను సీఎం ఆదేశాల మేరకు నూటికి నూరుశాతం రాష్ట్రంలో అమలుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి డోస్ కోసం 96 లక్షల వాక్సిన్లు, సెకండ్ డోస్ పూర్తిచేయడం కోసం 33 లక్షల వ్యాక్సిన్లు మొత్తం 1 కోటి 29 లక్షల వ్యాక్సిన్ల అవసరం ఉందన్నారు. ఈ నెల చివరి వరకు 10 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, 3 లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్లు మొత్తం 13 లక్షల వ్యాక్సిన్లు తక్షణావసరముందన్నారు. ఆ మేరకు వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. అదేవిధంగా 2 వేల వెంటిలేటర్లు రాష్ట్రానికి అవసరమున్ననేపథ్యంలో తక్షణమే సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి విజ్జప్తి చేశారు. రాష్ట్ర విజ్ఞప్తులపై స్పందించిన కేంద్రమంత్రి తెలంగాణ అవసరాలరీత్యా తక్షణమే సరఫరాకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.