సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ వన్ కుర్చీ వైపు వేగంగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. దానికి తోడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. పరిస్థితులు చక్కబడ్డాక మిగిలిన షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు పరశురామ్. దానికి తోడు ఈ మధ్య యూనిట్లో కొంతమందికి కరోనా సోకడంతో అందరూ ఇసోలేషన్ కి వెళ్ళిపోయారు. మహేష్ బాబు కూడా దాదాపు రెండు వారాలు ఎవరికీ కనిపించలేదు.
ఆయన పర్సనల్ మేకప్ మెన్ కు కరోనా వచ్చింది. దాంతో ఉన్నఫలంగా కుటుంబంతో సహా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు మహేష్ బాబు. సర్కారు వారి పాట ఇలా ఉండగానే త్రివిక్రమ్ సినిమా కూడా ఖరారు చేశాడు మహేష్. ఈ చిత్రం షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో రెండు సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నాడు మహేష్. దీనికి తగ్గట్లుగానే షెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సమ్మర్ 2022లో విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రయోగాత్మక కథలకు కాస్త. దూరంగా ఉండాలని.. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలని భావిస్తున్నాడు సూపర్ స్టార్. అసలే కరోనాతో ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రయోగాత్మక కథలు చేస్తే లేనిపోని రిస్కు తీసుకున్నట్లు అవుతుంది. దానికి తోడు వందల కోట్లు నష్టాలు కూడా వస్తాయి. అందుకే కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలని మహేష్ నిర్ణయించుకున్నాడు.
తన దగ్గరికి కథలు తీసుకొచ్చే దర్శకులకు కూడా ఇదే చెబుతున్నాడు సూపర్ స్టార్. కథలో కమర్షియల్ అంశాలు లేకపోయినా.. ఏ మాత్రం తనకు తేడాగా అనిపించినా నిర్దాక్షిణ్యంగా నో చెబుతున్నాడు. ఈ క్రమంలోనే కొందరు ప్రముఖ దర్శకులకు కూడా ఆయన నో చెప్పాడు. ఏ మాత్రం రిస్క్ అనిపించినా కూడా ముందుకు వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి, సుకుమార్ లాంటి దర్శకులు చెప్పిన కథలను కూడా మహేష్ సున్నితంగా తిరస్కరించాడు. ఇకపై కూడా కథల విషయంలో ఇంతే కఠినంగా ఉండాలి అని చూస్తున్నాడు మహేష్