ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ
ఉమ్మడి జిల్లాలో 1.87 లక్షల ఇండ్ల యజమానులకు లబ్ధి
కార్పొరేషన్, మే 3:నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి మరో చాన్స్ వచ్చింది. ఏప్రిల్ 30 వరకే ఉండే ఎర్లీబర్డ్ అవకాశాన్ని ప్రభుత్వం ఈ నెల 31 వరకు కల్పించింది. ఈ లోపు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ దక్కనుండగా, ఉమ్మడి జిల్లాలో 1.87 లక్షల ఇళ్ల యజమానులు వినియోగించుకునే అవకాశం ఉన్నది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో అధికారులు ఆస్తి పన్ను ముందస్తు వసూళ్లు (ఎర్లీబర్డ్) పై దృష్టి పెట్టారు. ఈ పథకానికి ప్రతి యేటా ఏప్రిల్ 30 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అయితే, గత ఏడాదిన్నరగా దేశంలో కొవిడ్-19 ప్రభావంతో ప్రజలు ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో 10 వేల కంటే తక్కువ ఆస్తి పన్ను ఉన్న వారికి ప్రభుత్వం 50 శాతం మాఫీ చేసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ పథకం కింద చెల్లింపుల కోసం మరో నెల అవకాశం ఇచ్చింది. ఈ లెక్కన మే 31లోగా పన్నులు చెల్లించిన అందరికీ ఈ అవకా శం దక్కనున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముందస్తు పన్నుల చెల్లింపులపై గత రెండేళ్లుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. ఈ వసూళ్లను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ అన్ని మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు ఆస్తి పన్నుల (ఎర్లీబర్డ్) వసూళ్లపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు దృష్టి సారిస్తున్నాయి. ఈసారి కరీంనగర్ నగరపాలక సంస్థలో మార్చి చివరి నాటికి రూ.2.85 కోట్ల మేరకు వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఈసారి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్నా పన్ను వసూళ్లు మాత్రం సాగుతూనే ఉన్నాయి.