అసలే కరోనా మహమ్మారి ఇప్పుడు ఉధృతంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అంతా భయపడుతున్నారు. పైగా చాలా మంది ప్రముఖులు కూడా కరోనా బారిన పడి మరణించారు. ఇలాంటి సమయంలో మరో చేదు వార్తను కావాలనే సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు వ్యాప్తి చేస్తున్నారు. అదే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి చనిపోయారని పుకారు పుట్టించడం. ఇలాంటి వార్తలు చదివి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. నిజంగానే ఇది జరిగిందా.. దయచేసి నిజం చెప్పండి.. మీనాక్షి ఇక లేరా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది అబద్ధం అని.. అలాంటిదేం లేదని.. ఆమె చాలా బాగున్నారంటూ ఆమె సన్నిహితులు చెప్తున్నారు. కావాలనే కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారని.. అలాంటి వాళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు కూడా.
మీనాక్షి శేషాద్రి మరణించారనే వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తుంది. కరోనా కారణంగా ఈమె కన్నుమూసారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మే 1న ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో తలాష్ ఏక్ తార అనే ప్రోగ్రామ్ వచ్చింది. ఉన్నట్లుండి మాయమైపోయిన హీరోయిన్ల గురించి ఈ ఎపిసోడ్ సాగుతుంది. అందులో మీనాక్షి గురించి కూడా చెప్పుకొచ్చారు. అప్పటి వరకు బిజీగా ఉన్న మీనాక్షి ఉన్నఫలంగా ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోయారు. పెయింటర్ చిత్రంతో మీనాక్షి శేషాద్రి బాలీవుడ్లోకి అడుగు పెట్టారు. మొదటి చిత్రం పెద్దగా ఆడలేదు. ఈ కారణంగా ఆమె నటిగా కొనసాగకూడదని కూడా నిర్ణయించుకుంది. అలాంటి సమయంలో మంచి సినిమాలు వచ్చాయి.
పైగా డాన్సర్ కూడా కావడంతో ప్రదర్శనలు కూడా చేసింది. మీనాక్షి శేషాద్రి అసలు పేరు శశికళ శేషాద్రి. కానీ బాలీవుడ్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరును మార్చుకుంది. హీరో సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్నుంచి బిజీ అయిపోయింది. ఆ తర్వాత జంగ్, ఖాతికా, డామిని, లవ్ మ్యారేజ్ వంటి చాలా హిట్ సినిమాల్లో నటించారు ఈమె. ఈ చిత్రాలతో మీనాక్షి బాలీవుడ్లో ఉత్తమ నటిగా నిలిచింది. డెడ్లీ చిత్రం తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసింది. బ్యాంకర్ను వివాహం చేసుకున్న తర్వాత అమెరికాకు షిఫ్ట్ అయింది. అక్కడే ఉంటుందిప్పుడు. ఉన్నట్లుండి ఇప్పుడు ఈమె మరణించారనే వార్త విన్న తర్వాత అభిమానులు షాక్ అయ్యారు. తెలుగులోనూ చిరంజీవి హీరోగా వచ్చిన ఆపద్భాందవుడు సినిమాలో నటించింది ఈమె.