ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్(124: 64 బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సర్లు) అద్భుత శతకానికి తోడు సంజూ శాంసన్(48: 33 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(12), రియాన్ పరాగ్(15 నాటౌట్), డేవిడ్ మిల్లర్(7 నాటౌట్) బ్యాటింగ్కు వచ్చారు.
ఈ మ్యాచ్లో వీరిద్దరి బ్యాటింగే హైలెట్. వీరిద్దరూ రెండో వికెట్కు 150(81 బంతుల్లో) పరుగులు జోడించారు. అర్ధశతకం పూర్తైన తర్వాత బట్లర్ బౌండరీల వర్షం కురిపించాడు. మైదానం నలువైపులా తనదైన స్టైల్లో పరుగులు రాబట్టాడు. మరో ఎండ్లో కెప్టెన్ శాంసన్ అర్ధశతకానికి చేరువలో ఔటయ్యాడు. విజయ్ శంకర్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్కు యత్నించి వెనుదిరిగాడు
ఈ జోడీ విధ్వంసాన్ని ఏ ఒక్క బౌలరూ అడ్డుకోలేకపోయాడు. రషీద్ ఖాన్ ఒక్కడే కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్మెన్ను కాస్త నియంత్రించాడు. రైజర్స్ బౌలర్లలో సందీప్, రషీద్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు. నాలుగు ఓవర్లు వేసిన సందీప్ అత్యధికంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు.