న్యూఢిల్లీ, మే 1: కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం)గాను ఆలస్యమైన, సవరించిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్ల దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం పొడిగించింది. ఈ నెల 31లోగా దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. ‘రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి దృష్ట్యా, దేశవ్యాప్తంగా ఉన్న ట్యాక్స్ పేయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఐటీఆర్సహా వివిధ ఆదాయ పన్ను గడువులను మే 31దాకా పొడిగిస్తున్నాం’ అని ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. సెక్షన్ 148 కింద ఐటీఆర్ల కోసం నోటీసులు అందుకున్నవారు కూడా మే 31లోగా దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు సీబీడీటీ పేర్కొన్నది. వివాదాల పరిష్కార కమిటీ (డీఆర్పీ)కి అభ్యంతరాల దాఖలుకున్న గడువునూ ఈ నెలాఖరుదాకా పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సీబీడీటీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు ఎంతో మేలు చేయగలదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితులు ఇలాగే ఉంటే గడువును మరికొంతకాలం పొడిగించే వీలుకూడా లేకపోలేదని వారు చెప్తున్నారు.