కరోనా కారణంగా జనజీవనం స్తంభించిన వేళ.. క్రికెట్ అభిమానులకు ముంబై, చెన్నై మ్యాచ్ ఫుల్ మజానిచ్చింది. డుప్లెసిస్, మొయిన్ అలీ అర్ధశతకాలకు అంబటి రాయుడు మెరుపులు తోడవడంతో ధోనీ సేన భారీ స్కోరు చేస్తే.. పొలార్డ్ ఒంటి చేత్తో మ్యాచ్ను ముంబై వైపు లాక్కెళ్లాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ఈ విండీస్ ఆజానుభావుడు.. చెన్నై బౌలర్లను చితక్కొట్టి ఐపీఎల్లో రెండో అత్యధిక ఛేదనలో సూపర్ హీరోగా నిలిచాడు.
ఢిల్లీ: పరుగుల వరద పారిన పోరులో ముంబైదే పైచేయి అయింది. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మాజీ చాంపియన్ల పోరాటంలో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 కెట్లకు 218 పరుగులు చేసింది. మొయిన్ అలీ (58; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), డుప్లెసిస్ (50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలు సాధిస్తే.. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పొలార్డ్ (34 బంతుల్లో 87; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
బాదుడే బాదుడు..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై ఆరంభంలోనే గైక్వాడ్ (4) వికెట్ కోల్పోయినా డుప్లెసిస్, అలీ ధాటిగా ఆడటంతో ధోనీ సేనకు మెరుపు ఆరంభం లభించింది. వరుస బౌండ్రీలతో విరుచుకుపడిన అలీ 33 బంతుల్లో, డుప్లెసిస్ 27 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేసే బుమ్రా (1/56)ను లక్ష్యంగా చేసుకొని ఈ జోడీ పరుగులు రాబట్టింది. రెండో వికెట్కు 108 పరుగులు జోడించాక అలీ ఔట్ కాగా.. పొలార్డ్ వరుస బంతుల్లో డుప్లెసిస్, రైనా (2)ను ఔట్ చేయడంతో స్కోరు వేగం తగ్గినా.. రాయుడు ముంబై బౌలర్లను చీల్చి చెండాడాడు.
పొలార్డ్ ఒంటిచేత్తో..
భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్కు మంచి ఆరంభం లభించింది. రోహిత్ (35), డికాక్ (38) నిలకడగా ఆడటంతో పవర్ప్లే ముగిసే సరికి ముంబై వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది. కాసేపటికి రోహిత్ను శార్దూల్ ఔట్ చేయగా.. సూర్యకుమార్ (3) ఇలా వచ్చి అలా వెళ్లాడు. డికాక్ను అలీ రిటర్న్ క్యాచ్తో డగౌట్ పంపడంతో ముంబై కష్టాల్లో పడింది. ఈ దశలో కృనాల్ (32)తో కలిసి పొలార్డ్ భారీ షాట్లకు దిగాడు. జడేజా ఓవర్లో మూడు సిక్సర్లు అరుసుకున్న పొలార్డ్.. ఎంగ్డీ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. శార్దూల్ ఓవర్లో 6,4,4,4 కొట్టిన పొలార్డ్ ఈ సీజన్లో వేగవంతమైన (17 బంతుల్లో) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఆఖర్లో హార్దిక్ (16) కూడా ధాటిగా ఆడగా చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దశలో పొలార్డ్ 4,4,6,2తో ముంబైకి విజయాన్నందించాడు.
రాయుడు రచ్చ..
మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన రాయుడు వరుస సిక్సర్లతో విరుచుకుపడటంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. కులకర్ణి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అంబటి.. బుమ్రా ఓవర్లో 6,4 అరుసుకున్నాడు. బౌల్ట్ ఓవర్లో 6,4,6 కొట్టిన రాయుడు.. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు 6,4 బాదడంతో చెన్నై చివరి ఐదు ఓవర్లలో 82 పరుగులు రాబట్టింది.
స్కోర్ బోర్డు
చెన్నై: గైక్వాడ్ (సి) హార్దిక్ (బి) బౌల్ట్ 4, డుప్లెసిస్ (సి) బుమ్రా (బి) పొలార్డ్ 50, అలీ (సి) డికాక్ (బి) బుమ్రా 58, రైనా (సి) కృనాల్ (బి) పొలార్డ్ 2, రాయుడు (నాటౌట్) 72, జడేజా (నాటౌట్) 22, ఎక్స్ట్రాలు: 10, మొత్తం: 218/4. వికెట్ల పతనం: 1-4, 2-112, 3-116, 4-116, బౌలింగ్: బౌల్ట్ 4-0-42-1, కులకర్ణి 4-0-48-0, బుమ్రా 4-0-56-1, చాహర్ 4-0-32-0, నీషమ్ 2-0-26-0, పొలార్డ్ 2-0-12-2.
ముంబై: డికాక్ (సి అండ్ బి) అలీ 38, రోహిత్ (సి) గైక్వాడ్ (బి) శార్దూల్ 35, సూర్యకుమార్ (సి) ధోనీ (బి) జడేజా 3, కృనాల్ (ఎల్బీ) సామ్ 32, పొలార్డ్ (నాటౌట్) 87, హార్దిక్ (సి) డుప్లెసిస్ (బి) సామ్ 16, నీషమ్ (సి) శార్దూల్ (బి) సామ్ 0, కులకర్ణి (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 219/6. వికెట్ల పతనం: 1-71, 2-77, 3-81, 4-170, 5-202, 6-203, బౌలింగ్: దీపక్ 4-0-37-0, సామ్ కరన్ 4-0-34-3, ఎంగ్డీ 4-0-62-0, శార్దూల్ 4-0-56-1, జడేజా 3-0-29-1, అలీ 1-0-1-1.