వాషింగ్టన్: డిజాస్టర్ గర్ల్గా పాపులర్ అయిన ఒక మీమ్ సుమారు 5 లక్షల డాలర్లకు ( రూ.3.7 కోట్లకు) అమ్ముడుపోయింది. తన చిన్ననాటి ఫోటో వల్ల రాత్రికి రాత్రే కోటీశ్వరాలైన ఆ అమెరికా యువతి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 2005లో నార్త్ కరోలినా మెబేన్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఇంటికి వ్యాపించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దానికి కాస్త దూరంలో నాలుగేండ్ల బాలిక జోయ్ రోత్ తన సోదరుడు, తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నది. ఫొటోగ్రాఫర్ అయిన ఆమె తండ్రి డేవ్ రోత్ తన కుమార్తెను నవ్వమని చెప్పాడు. చింపిరి జుత్తుతో ఉన్న ఆ బాలిక చిరునవ్వులు చిందించగా ఆమె వెనుక ఓ ఇల్లు మంటల్లో కాలిపోతున్నది.
తండ్రి దేవ్ తీసిన ఈ ఫొటో అనంతరం ఎంతో పాపురల్ అయ్యింది. ఆ బాలికను డిజాస్టర్ గర్ల్గా పేర్కొంటూ గత పదేండ్లుగా ఎన్నో మీమ్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఇటీవల అమెరికాలో రాజుకున్న నల్ల జాతీయుల ఆందోళనల సందర్భంగాను ఈ ఫొటోతో కూడిన మీమ్స్ వైరల్ అయ్యాయి.
మరోవైపు డేవ్ తీసిన ఈ ఫొటో 2007 కాంటెస్ట్లో గెలిచింది. నాటి నుంచి ఎంతో పాపులర్ అయ్యింది. ఈ ఒరిజినల్ ఫొటోను డిజిటర్ ఆర్ట్ రూపంలో నిక్షిప్తమయ్యే నాన్ ఫంగిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ)కు అమ్మే అవకాశం వారికి వచ్చింది. తొలుత దీనిని ఫేక్గా జోయ్, ఆమె తండ్రి దేవ్ భావించారు. అప్పటికే ఎన్ఎఫ్టీలో ఉన్నవారిని సంప్రదించారు. న్యాయపరంగాను సలహాలు తీసుకున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17న ఎన్ఎఫ్టీలో ఉన్న ఒకరి నుంచి వచ్చిన ఆహ్వానంతో ఒరిజినల్ ఫొటోను డిజిటల్ కోడ్ రూపంలో ప్రవేశపెట్టి ఆక్షన్కు వీలు కల్పించారు. చివరకు @3FMusic అనే యూజర్ 4,95,000 డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలో దీనిని కొనుగోలు చేశారు. ఈ మొత్తంతోపాటు భవిష్యత్తులో ఈ డిజిటల్ కాపీ అమ్ముడయ్యే ప్రతి సారి వీరికి పది శాతం కమీషన్ కూడా వస్తుంది. దీని వల్ల ఒరిజినల్ ఫొటోపై వారికి ఎలాంటి హక్కులు ఉండవు. అయితే ఆ ఫొటోపై కాపీరైట్ హక్కులు మాత్రం వారికే చెందుతాయి.