పనాజీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. దేశ వ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. మరోవైపు చికిత్స కోసం కరోనా రోగులు భారీగా ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. గోవాలో కరోనా పరిస్థితిపై మంత్రి మైఖేల్ లోబో ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిలో పడకలన్నీ కరోనా రోగులతో నిండిపోయాయని చెప్పారు. గోవా మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో లేవన్నారు. మరోవైపు కరోనా రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తూనే ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి గొలుసును బ్రేక్ చేసేందుకు లాక్డౌన్ను 9 రోజులకు పొడిగించాలని కోరుతూ సీఎంకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు.
మరోవైపు గోవాలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నాలుగు రోజులు లాక్డౌన్ విధించారు. నిత్యావసరాలైన సూపర్ మార్కెట్లు, కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు వంటివి ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు తెరిచేందుకు అనుమతించారు.