హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచదేశాలను వరుసగా రెండో ఏడాదీ గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ముక్కు టీకాతో కళ్లెం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముక్కులో స్ప్రే చేసే ఔషధం 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు బ్రిటన్లో నిర్వహించిన ప్రయోగాల్లో నిరూపితమైంది. ముక్కు ద్వారా ఔషధాన్ని స్ప్రే చేస్తారు కాబట్టి వైరస్ ఊపిరితిత్తులకు చేరకుండా అది నిరోధిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మన దేశంలో భారత్ బయోటెక్ సంస్థ నాసల్స్ప్రే క్లినికల్ ట్రయల్స్ను ఇప్పటికే చేపట్టింది. మరికొన్ని కంపెనీలు నాసల్ స్ప్రే వ్యాక్సిన్ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఏమిటీ నాసల్ స్ప్రే, ఎవరు రూపొందించారు?
కెనడాలోని వాంకోవర్కు చెందిన బయోటెక్ కంపెనీ ‘సెనోటైజ్’ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను రూపొందించింది. ఈ స్ప్రేను రోగులే సొంతంగా తమ ముక్కులో స్ప్రే చేసుకోవచ్చు. ఇది ముక్కులో ఉన్న వైరల్ లోడ్ను తగ్గిస్తుంది. దీంతో వైరస్ ముక్కులోనే అంతమైపోయి ఊపిరితిత్తుల వరకు వెళ్లే ఆస్కారం ఉండదు. కెనడా, బ్రిటన్లో దీని ట్రయల్స్ జరిగాయి. కరోనా బారిన పడిన 79 మందిపై నిర్వహించిన రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో.. 24 గంటల్లో 95% వైరస్ లోడ్ తగ్గినట్టు వెల్లడైంది. 79 గంటల్లో 99% వరకు వైరస్ లోడ్ తగ్గిపోయినట్టు తేలింది. బ్రిటన్లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్పై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేసినట్టు తేలింది.
అందరికీ నెగెటివ్
కెనడాలో రెండోదశ ట్రయల్స్లో 103 మంది పాజిటివ్ వ్యక్తుల ముక్కులో స్ప్రే చేయగా, అందరికీ నెగెటివ్ వచ్చింది. బ్రిటన్లో ఎన్హెచ్ఎస్ నిర్వహించిన రెండోదశ ట్రయల్స్లో 70మంది రోగులు పాల్గొన్నారు. వారితో పోల్చితే ట్రయల్స్ నిర్వహించని వారి ముక్కులో 16 రెట్లు అధికంగా వైరస్లోడ్ ఉన్నట్టు తేలింది. కెనడాలో ఏడువేల మందిలో ట్రయల్స్ నిర్వహించగా ఎవరికీ చెప్పుకోదగిన సైడ్ఎఫెక్ట్స్ రాలేదు.
నాసల్ స్ప్రేతో కొత్త ఆశలు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ హాహాకారాలు సృష్టిస్తున్నది. రోజువారీ కేసులు, మరణాల్లో భారత్ మొదటిస్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండోస్థానంలో, అమెరికా మూడోస్థానంలో ఉన్నాయి. కరోనాను అదుపుచేసేందుకు ప్రభుత్వాలు చేయగలిగినంతా చేస్తున్నప్పటికీ ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపించడంలేదు. అయితే బ్రిటన్లో నిర్వహిస్తున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్ ట్రయల్స్ కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. మన దేశంలో నాసల్ స్ప్రే ట్రయల్స్ను ఫాస్ట్ట్రాక్పై తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తప్పకుండా కరోనాను అదుపుచేస్తుందని, ప్రస్తుత వ్యాక్సిన్లకు ప్రత్యామ్నాయంగా మారగలదని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
మన దేశానికి ఎప్పటివరకు రావచ్చు
నాసల్ స్ప్రే తయారుచేసిన సెనోటైజ్ ప్రస్తుతం బ్రిటన్, కెనాడాలో విక్రయాలకు అత్యవసర అనుమతి కోరింది. ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ఇప్పటికే స్ప్రే వాడకానికి అనుమతులిచ్చాయి. గత నెలలోనే కంపెనీ ఇజ్రాయెల్లో స్ప్రే ఉత్పత్తి ప్రారంభించింది. ఇది వచ్చే నెల నుంచి అక్కడి మార్కెట్లో ఒక్క స్ప్రే బాటిల్ 30 అమెరికన్ డాలర్లకు అందుబాటులోకి రానుంది. భారత్లో నాసల్ స్ప్రే ఉత్పత్తి కోసం తాము భాగస్వామిని వెతుకుతున్నట్లు సెనోటైజ్ సీఈవో, సంయుక్త వ్యవస్థాపకులు డాక్టర్ గిలీ రెగెవ్ తెలిపారు. ప్రస్తుతం తాము బడా ఫార్మా కంపెనీలతో మాట్లాడుతున్నామని, ఇంకా ప్రభుత్వంతో కానీ, రెగ్యులేటర్స్నుగానీ సంప్రదించలేదని వివరించారు.
భారత్ బయోటెక్లో నాసల్ వ్యాక్సిన్ పరీక్షలు
కొవాగ్జిన్ను తయారుచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ కూడా ‘కోరోఫ్లూ’ పేరుతో రూపొందించిన నాసల్ వ్యాక్సిన్ ట్రయల్స్ను జనవరిలో చేపట్టింది. ఇది రోగికి ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుందని సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని, ఇది వ్యాక్సిన్కు మంచి ప్రత్యామ్నాయం అవుతుందని అన్నారు. భారత్ బయోటెక్ వాషింగ్టన్ యూనివర్సిటీతో కలిసి ఈ ముక్కు టీకాను అభివృద్ధి చేస్తున్నది. మొదటి దశ ప్రయోగాల్లో భాగంగా ఈ టీకాను దేశంలోని నాలుగు నగరాల్లో 175 మందికి స్ప్రే చేశారు. కొద్ది రోజుల్లోనే ఫలితాలు రానున్నాయి.