న్యూఢిల్లీ: దేశాన్ని శత్రు మూకల నుంచి కంటికి రెప్పలా కాపాడుకునే త్రివిధ దళాలు కొవిడ్పై పోరులోనూ మేము సైతం అంటున్నాయి. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే తాము ప్రత్యేకంగా కొవిడ్ ఆసుపత్రులను నెలకొల్పుతున్నామని ప్రకటించగా.. తాజాగా ఇండియన్ నేవీ కూడా ముందుకు వచ్చింది. కొవిడ్ పేషెంట్ల కోసం తమ ఆసుపత్రుల తలుపులు కూడా తెరిచింది. సాధారణ పౌరుల కోసం తమ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా కొన్ని బెడ్లను కేటాయించింది.
వెస్టర్న్ నావల్ కమాండ్ (డబ్ల్యూఎన్సీ) కింద ఉన్న మూడు నావల్ హాస్పిటల్స్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఐఎన్హెచ్ఎస్, గోవా, ఐఎన్హెచ్ఎస్ పతంజలి, కార్వార్, ఐఎన్హెచ్ఎస్ సంధానీ, ముంబైలలో కొన్ని ఆక్సిజన్ అందుబాటులో ఉన్న బెడ్లను కేటాయించారు. అంతేకాదు వలస కూలీల కోసం కూడా ముంబైలో తమ ఆవరణలో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించింది. సుమారు 1500 మంది వలస కూలీలకు కావాల్సిన నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లు ఇక్కడ చేయడం విశేషం.