జహీరాబాద్, ఏప్రిల్ 26 : జహీరాబాద్ పట్టణంతోపాటు విలీన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. సోమవారం జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేండ్లలో మున్సిపాలిటీలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు పైపులైన్లు వేసి నల్లాలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ఉన్న ప్రధాన రోడ్డును విస్తీర్ణం చేసి కొత్తగా డివైడర్లు నిర్మిస్తామని తెలిపారు. పట్టణంలో విద్యుత్ దీపాల ఏర్పాటుతోపాటు వైకుంఠధామాలు నిర్మించామన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మిస్తామని చెప్పారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు, నాయకులు రాజేందర్, ఇజ్రాయిల్ బాబీ, మొహినోద్దీన్, ముర్తుజా, హంజా తదితరులు ఉన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మె ల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం న్యాల్కల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నదని తెలిపారు. న్యాల్కల్ మండలంలో 259 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,59, 30,044 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.