వర్ధమానుకోట గ్రామంలో 1465కుటుంబాలు ఉండగా 6వేల జనాభా ఉన్నారు. గ్రామాన్ని హరితవనం చేయాలనే సంకల్పంతో పంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ భూమిని గుర్తించి ఉపాధి హామీ కూలీల ద్వారా కంపచెట్లు తొలగించారు. పంచాయతీ భవనం, పాఠశాల, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రీగార్డులు పెట్టించారు. ట్రాక్టర్ ద్వారా మొక్కలకు నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. ప్రతి రోజూ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి వీధులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. రూ.12.50లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50లక్షలతో డంపింగ్యార్డు, రూ.2.50లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు.
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనం..
వర్ధమానుకోట గ్రామంలో ఏర్పాటు చేసిన పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి పూల మొక్కలతో పాటు 23రకాల మొక్కలు నాటించారు. కోనోకార్పస్, వేప, కానుగు, జామ, ఖర్జూర, ఉసిరి, దానిమ్మ, మందార, పచ్చ గన్నేరు, నూరు వరాలు, తులసి, గోరింట మొక్కలను నాటి ప్రతి రోజూ నీరందిస్తుండడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. పార్కులో మొక్కల మధ్య పిచ్చి మొక్కలు పెరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మా గ్రామానికి నిధులు మంజూరు చేయడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సహకారం మరువలేం.