దశాబ్దాల చరిత్ర ప్రభుత్వ ఇందిరా ప్రియదర్శిని కళాశాలది. నాడు కొందరితో మొదలైన విద్యాలయం నేడు వేలాది మందికి విద్యనందిస్తూ.. ఉపాధి కల్పనకు బాటలు వేస్తున్నది. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థిణులు ఉన్నత శిఖరాలకు ఎదిగారు. కళాశాలలో నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, తదితర వాటిని గుర్తించిన న్యాక్పీర్ కమిటీ ఇటీవల న్యాక్ ఏ గ్రేడ్ను ప్రకటించింది. అంతేకాకుండా కళాశాలలో విద్యార్థిణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం మరో జీప్లస్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికాగా.. త్వరలోనే అందుబాటులోకి రానున్నది.
సుల్తాన్బజార్, ఏప్రిల్ 19 : విద్యార్థినులకు మెరుగైన విద్యను అందించడంలో ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విశేషంగా కృషి చేస్తుంది. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కళాశాలలో ఎంతో మంది విద్యార్థిణులు విద్యను అభ్యసించి నేడు ఉన్నత రంగాల్లో విద్యను అభ్యసిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు న్యాక్ ఏ గ్రేడ్ రావడమే నిదర్శనం. ప్రతి సంవత్సరం నూతన కోర్సులను ప్రవేశపెడుతూ విద్యార్థులు ఎంతో ఉన్నతంగా ఎదిగేందుకు కళాశాల పాలక వర్గం నిరంతరం కృషి చేస్తుంది. విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థినులు భవిష్యత్తులో ఉన్నతగా ఎదిగేందుకు టీఎస్కేసీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్లు నిర్వహించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
కళాశాలలో గతంలో విద్యార్థులు 1200 మందివరకు ఉండేది. ప్రస్తుతం 2వేలు దాటింది. దీంతో విద్యార్థిణుల సౌకర్యార్థం 2019లో సుమారు రూ.70 లక్షల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో జీ ప్లస్2 భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ భవనంలో విశాలమైన తరగతి గదులను, బయోటెక్నాలజీ ల్యాబ్లను, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయనున్నారు.