వరంగల్ జూ పార్కులో కొత్త విధానం
దత్తత తీసుకుంటే కుటుంబసభ్యులకు ఏడాదిపాటు ఉచిత ప్రవేశం
ఎండాకాలంలో ప్రాణులకు ఇబ్బంది లేకుండా చర్యలు
ఆస్ట్రిచ్కు మూడు నెలలకు రూ.60వేలు
రామచిలుకకు మూడు నెలలకు రూ.వెయ్యి
అటవీ శాఖ అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు
వరంగల్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటేనే ప్రకృతి సమతుల్యత ఉంటుంది. జంతువులు, పక్షులను నిరంతరం సంరక్షించుకుంటేనే జీవ వైవిధ్యం సాధ్యమవుతుంది. జీవాల సంరక్షణ బాధ్యత ఒక్క అటవీ శాఖదే కాదు.. అందరిదీ. చిన్నస్థాయి జూ పార్కుల్లో దేశంలోనే ప్రసిద్ధి పొందిన వరంగల్లోని కాకతీయ జూలాజికల్ పార్కు, జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రక్రియలో కొత్త విధానాలను అమలు చేస్తున్నది. జంతువులు, పక్షుల భద్రత, సంరక్షణ కోసం వాటిని ‘దత్తత’ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. వ్యక్తులుగానీ, సంస్థలుగానీ తమకిష్టమైన జంతువులను, పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకోవచ్చు. ఆయా జంతువులు, పక్షుల నిర్వహణ ఖర్చులు బట్టి దత్తత తీసుకున్న వారు అటవీ శాఖకు సంబంధిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటికే వంద మందికిపైగా భాగస్వామ్యం
మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలంపాటు తమకిష్టమైన జంతువులు, పక్షుల పోషణ ఖర్చులు ఇవ్వొచ్చు. జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయడమే లక్ష్యంగా అటవీ శాఖ దత్తత విధానాన్ని అమలు చేస్తున్నది. వరంగల్ జూ పార్కులోని జంతువులు, పక్షుల సంరక్షణ కోసం ఇప్పటికే వంద మందికిపైగా భాగస్వాములయ్యారు. ఎండకాలం నేపథ్యంలో పార్కులోని జీవాల అవసరాలు తీర్చేందుకు మరింత మంది ముందుకొస్తున్నారు. బర్త్ డేలు, పెండ్లి రోజు సందర్భంగా చాలా మంది ఇప్పుడు జంతువులు, పక్షుల సంరక్షణ కోసం ‘దత్తత’ విధానంలో భాగస్వాములవుతున్నారు. కొందరు యువకులు తమ పెద్దల పేరుతో దత్తత కోసం నిధులిస్తున్నారు. జంతు, పక్షి ప్రేమికులు ఇచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసేలా అటవీ శాఖ అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ‘వ్యక్తులు, సంస్థలు డబ్బును డీడీ రూపంలో లేదా, నగదు రూపంలో ఇవ్వవచ్చు. దత్తత విధానంలో భాగస్వాములైన వారికి జూ పార్కులో ప్రత్యేక గౌరవం దక్కేలా ఏర్పాట్లు చేశారు. దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు ఏడాదిపాటు జూ పార్కులోకి ఉచితంగా ప్రవేశం ఉంటుంది. విద్యా సంస్థలకైతే ఎంట్రీ టికెట్లో 50శాతం మినహాయింపు ఇస్తారు. దత్తత తీసుకున్నవారు జంతువు, పక్షులను జూ పార్కులో దగ్గర నుంచి చూసేందుకు అనుమతిస్తారు.