హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని, తొందరపాటు నిర్ణయాలు ఉండవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ప్రజలెవరూ హైరానా పడొద్దని, పరిశ్రమల మూసివేత ఉండదని తెలిపారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ప్రజలంతా మాస్కులు ధరించి, స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. శుక్రవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
కరోనా కట్టడికి అన్ని చర్యలు
ఇప్పటికే చాలా దెబ్బతిన్నం.. తొందరపడి, ఆగమాగమై రాష్ట్రంలో లాక్డౌన్ విధించం. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటం. ఎవరూ బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, శానిటైజేషన్ చేసుకుంటే కరోనా తక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఫంక్షన్లలో మాస్ గ్యాదరింగ్, ఊరేగింపులు వంటివి తగ్గించుకుంటే మంచిది. కరోనా కట్టడికి వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణే ముఖ్యం. ఆ మార్గాన్ని ప్రజలందరూ పాటించాలి. ఇప్పుడు మూఢాలున్నయి కాబట్టి పెండ్లిళ్లు జరుగుతలెవ్వు. మే నెల వరకు పరిస్థితులు ఎట్లా ఉంటయో అప్పటివరకు చూద్దాం.
సినిమా వాళ్లు బాధలు చెప్పుకొన్నరు
సినీ పరిశ్రమపై నాలుగైదు లక్షలమంది జీవిస్తున్నారు. కరోనా సమయంలో సినిమా పెద్దలు నా వద్దకు వచ్చి నష్టపోయామని చెప్తే.. ఏవో వెసులుబాట్లు కల్పించినం. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాతనే మనం కూడా సినిమా హాళ్లకు అనుమతి ఇచ్చినం. నిన్న మొన్న కూడా నా వద్దకు కొందరు వచ్చి మళ్లీ లాక్డౌన్ పెడతరా? సినిమాహాళ్లు మూసేస్తరా? అని సందేహాలు వ్యక్తంచేశారు. ప్రొడక్షన్లో ఉన్న సినిమా కూడా అగిపోతదని, పెద్ద ఎత్తున నష్టపోతామని వారి బాధలు చెప్పారు. ప్రపంచం మొత్తం కరోనా ఒత్తిడితో సతమతమవుతున్నది. దీనిద్వారా చాలా దుష్ఫలితాలు వచ్చాయి. ఇంతకుముందు కూడా కలరా, ప్లేగు వంటి చాలానే వ్యాధులు వచ్చాయి. కానీ అవి ఎక్కడో ఒక దగ్గర వచ్చి, రెండుమూడు నెలలు ప్రభావం చూపించి పోయేవి. కానీ ఇది ఎవ్వరికీ అంతుపట్టకుండా.. సంవత్సరకాలంగా ప్రపంచాన్ని వేధిస్తున్నది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటాం తప్ప లాక్డౌన్ విధించబోమని వారికి చెప్పిన.
కరోనా నియంత్రణలో మనమే మేటి..
కరోనా నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఇదే విషయం స్వయంగా కేంద్ర ప్రభుత్వమూ చెప్పింది. సెకండ్ వేవ్ సమాచారం రాగానే రాష్ట్రంలో టెస్టుల సంఖ్య కూడా పెంచినం. గురువారం ఒక్కరోజే సుమారు 70వేల టెస్టులు చేసినం. ఇప్పటివరకు 10.85 లక్షల మందికి టీకాలు ఇచ్చినం. మిగతావాళ్లకు ఇవ్వడం అనేది కేంద్రం చేతిలో ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మా అభిప్రాయాలు కూడా చెప్తున్నాం. వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తిని బట్టి కేంద్రం కూడా అన్ని రాష్ర్టాలకు సమానంగా వ్యాక్సిన్ను పంపిణీ చేస్తున్నది. వ్యాక్సినేషన్కు, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
బాధతోనే పాఠశాలల మూసివేత..
పాఠశాలలను బాధతోనే మూసివేశాం తప్ప..సంతోషంతో కాదు. హాస్టళ్లు, స్కూళ్లలో
చిన్నపిల్లలు ఉంటరు. అక్కడ కరోనా ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటది. కాబట్టి అది ఒక విస్ఫోటక రూపం చెందకముందే చర్యలు తీసుకోవాలని భావించినం. విద్యా సంస్థలను తాత్కాలికంగానే మూస్తున్నం.. పర్మనెంట్గా కాదు.