కేరళ ఎన్నికల బరిలో పలుచోట్ల వారసులు
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నుంచి దాదాపు 25మంది
తిరువనంతపురం, మార్చి 26: మరో పదిరోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి కేరళలోని రాజకీయ పార్టీలు అస్త్ర శస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 6న ఒకే విడుతలో జరుగనున్న ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకుల బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తున్నది. మొత్తం 140 అసెంబ్లీ సీట్లలో దాదాపు పాతిక స్థానాల నుంచి అమాత్యులు, రాజకీయ ప్రముఖుల కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, బంధువులే బరిలో ఉన్నారు.
అల్లుడి కోసం సులువైన బరి..
కేరళ సీఎం విజయన్ అల్లుడు పీఏ మొహమ్మద్ రియాజ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ ప్రెసిడెంట్గా ఉన్న రియాజ్.. బేపోర్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. కమ్యూనిస్టులకు కంచుకోటగా పిలిచే కోజికోడ్లో బేపోర్ కీలక స్థానం. సీపీఎం నేత వీకేసీ మామ్మద్ కోయ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తన అల్లుడి రాజకీయ ఆరంగేట్రానికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న బేపోర్ సరైన స్థానమని భావించిన విజయన్.. కోయతో సంప్రదింపులు జరిపి ఆస్థా నాన్ని తన అల్లుడికి దక్కేలా చేశారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్లుడు కూడా..
కేరళ మాజీ మంత్రి ఇబ్రహీం కుంజు కుమారుడు పీఈ అబ్దుల్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కే అచ్యుతన్ కుమారుడు సుమేశ్, దివంగత మాజీ ఎమ్మెల్యే ఎన్ విజయన్ పిళ్ళై కుమారుడు డాక్టర్ వీ సుజీత్, మాజీ మంత్రి థామస్ చండీ సోదరుడు థామస్ కే థామస్, సీపీఎం కార్యదర్శి (ఇంచార్జ్) ఏ విజయరాఘవన్ సతీమణి ఆర్ బిందు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ అల్లుడు పీవీ శ్రీనిజిన్ కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వీరితోపాటు పలువురు మాజీ మంత్రులు, సామాజిక కార్యకర్తల వారసులను అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమిలు బరిలో నిలిపాయి.
మతం పేరిట అస్సాం విడిపోయింది
న్యూఢిల్లీ, మార్చి 26: మతం, సంస్కృతి, భాష ప్రాతిపదికన అస్సాం సమాజం విడిపోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భయంతో కూడిన వాతావరణం ఉన్నదన్నారు. రాష్ట్రం మళ్లీ శాంతితో కూడిన అభివృద్ధి బాట పట్టాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలన్నారు.
బీజేపీ అరువు పార్టీ
కోల్కతా, మార్చి 26: ‘అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతను ఎదుర్కొనే దమ్మున్న నేత బీజేపీలో ఒక్కరంటే ఒక్కరు లేరు. అందుకే ఇతర పార్టీకీ చెందిన నేతలను చేర్చుకొని తంటాలు పడుతున్నది. బెంగాల్లో బీజేపీ.. ‘బారోడ్ జనతా పార్టీగా (అరువు పార్టీగా) మారింది’ అని ఇటీవల తృణమూల్లో చేరిన యశ్వంత్సిన్హా ఎద్దేవా చేశారు.