మెదక్ జిల్లాలో 12,500 మహిళా సంఘాలు
ఎస్హెచ్జీల రుణ లక్ష్యం ఇప్పటికే పూర్తి
బ్యాంకుల లక్ష్యం రూ.320 కోట్లు
రాష్ట్రంలో 5వ స్థానంలో జిల్లా
మెదక్, మార్చి 21 : మహిళా స్వయం, సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు లక్ష్యానికి మించాయి. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయిలో రుణాలు లక్ష్యాన్ని చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నా రు. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.320కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.322.14కోట్ల రుణాలు అందించి మెదక్ జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానం సాధించింది. స్త్రీ నిధి ద్వారా రూ.78కోట్ల 47లక్షల రుణాల పంపిణీ లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.57కోట్ల 55లక్షలు ఎస్హెచ్జీలకు అందజేశారు. మహిళా సంఘాల సభ్యులు చిన్న చిన్న వ్యాపారాలతో పాటు పాడి గేదెల కొనుగోలు, వివిధ వ్యాపారాల నిర్వహణకు రుణాలు తీసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. మెదక్ జిల్లాలో 12,500 ఎస్హెచ్జీ గ్రూపులు ఉన్నాయి. ఇందులో 1,37,863మంది సభ్యులు ఉన్నారు. అయితే 9311 ఎస్హెచ్జీ గ్రూపులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, 8743 సంఘాలకు రుణాలు ఇచ్చారు.
ఆర్థికంగా ఎదిగేందుకు అధికారుల ప్రోత్సాహం…
మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందించడమే కాకుండా వాటిని ఎ లా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రతి సంఘంలోని మహిళ ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు అందిస్తుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా మహిళా సంఘాల సభ్యులు రుణాలను తీసుకోవడమే కాకుండా వాటిని సరైన సమయంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా రుణాలను చెల్లించేలా చూస్తున్నారు. అయితే సభ్యులకు వారం వ్యవధిలోనే బ్యాంకు, స్త్రీ నిధి రుణాలు మంజూరవుతున్నాయి.
అది కూడా గ్రూపులోని మహిళ వ్యక్తిగత ఖాతాలోనే జమ చేస్తున్నారు. రుణాల మంజూరు ప్రక్రియ ఆన్లైన్ కావడంతో పత్రాలు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియను పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ఇటీవలే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల సీనియారిటీ ఆధారంగా రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల ద్వారా ఇప్పటికే లక్ష్యాన్ని మించి రుణాలు అందజేశారు.