బెల్లంపల్లిటౌన్, మార్చి 20 : నియోజకవర్గంలోని మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో కళాశాలల విషయంపై ఆయన మాట్లాడారు. కళాశాలలు లేకపోవడంతో బాలికలు పదోతరగతితోనే చదువు మానేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నదని పేర్కొన్నారు. కానీ బెల్లంపల్లి మున్సిపాలిటీలో మాత్రమే కళాశాల ఉన్నదని తెలిపారు. వేమనపల్లి మండలం పూర్తిగా మారుమూల, ప్రాణహిత తీరాన ఉంటుందని సభ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, గంగపుత్రులు, గొల్లకుర్మలు ఉన్నారని తెలిపారు. ఏటా 1200 నుంచి 1400 మంది విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులవుతున్నారని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నా 100 నుంచి 150 సీట్లు మాత్రమే ఉండడంతో సరిపోవడం లేదన్నారు. బాలికల డ్రాపౌట్లను తగ్గించేందుకు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు.