ప్రత్యేక ప్రతినిధి, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కేంద్రపన్నుల్లో రాష్ట్ర వాటా ఏయేటికాయేడు తగ్గుతున్నది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు తోడు.. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల అమలుతో అసలే అంతంతమాత్రంగా ఉన్న కేంద్రపన్నుల్లోని వాటాకు మరింత గండిపడింది. దీంతో ఖజానాపై భారీగా గండిపడుతున్నది. 2019-2020 సంవత్సరం వరకు 2.437% గా ఉన్న తెలంగాణ పన్నుల వాటా 2020-21లో 2.133%కి తగ్గింది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వాటా 2.102 అంటే 2.11%కి తగ్గింది. దీని ప్రకా రం కేంద్ర పన్నుల్లో మన వాటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.13 వేల కోట్లకు పడిపోయిం ది. వచ్చే ఆర్థిక సంవత్సరం తెలంగాణ వాటా గా రూ.13,390 కోట్లు మాత్రమే రానున్నదని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. వాస్తవానికి గతేడాది కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాను 42 నుంచి 41శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేయడం వల్ల అన్ని రాష్ర్టాలతోపాటు తెలంగాణ కూడా నష్టపోయింది. దీనికి తోడు కొవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం కావడంతో ఆ వాటా కాస్త 12 వేల కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరు నాటికి కేంద్ర పన్నుల్లో మన వాటా రూ.11,731 కోట్లు మాత్రమే ఉండవచ్చని తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. వాస్తవానికి 2019-20 లో కేంద్ర పన్నుల వాటా రూ.15,987 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. కొవిడ్ ప్రభావంతో కేంద్ర పన్నుల వసూళ్లు బాగా తగ్గడంతో తెలంగాణ పై కూడా ప్రతికూల ప్రభావం పడింది. 2020-21కి రూ. 20,20,926 కోట్ల మేరకు పన్నుల రాబడి ఉంటుందని కేంద్రం అంచనా వేయగా కొవిడ్ ప్రభావం వల్ల అంచనా బాగా తగ్గింది. ఆ అంచనాను కేంద్రం సవరించి రూ.15.55 లక్షల కోట్లకు తగ్గించింది. వివిధ రాష్ర్టాల నుంచి కేంద్ర పన్నుల రూపంలో వచ్చే రాబడిలో 2.102% (రూ.13,390 కోట్లు) వాటాగా రావచ్చని అంచనావేశారు.
ప్రస్తుతం పెట్టుబడి వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు ఎలాంటి వెయిటేజీ లేదు. ఆ అంశానికి కనీసం 7.5% మార్కులను ఇవ్వడం మంచిదని సూచించింది. ప్రస్తుతం జనాభాకు 15% వెయిటేజీ ఇస్తున్నారు. భౌగోళిక విస్తీర్ణానికి 15% వెయిటేజీ ఉన్నది. దాన్ని 20%కి పెంచాలని పేర్కొన్నది. అడవుల విస్తీర్ణానికి ప్రస్తుతం 10% వెయిటేజీ ఉంది. అడవుల అంశాన్ని భిన్న కోణంలో చూడాలని సర్కార్ కోరింది. ఉత్తర, ఈశాన్య రాష్ర్టాల్లో దట్టమైన అడవులు ఎక్కువగా ఉంటాయి. దక్షిణాది రాష్ర్టాలలో విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. అడవుల విస్తీర్ణానికి గంపగుత్తగా మార్కులివ్వకుండా ఆయా ప్రభుత్వాలు పచ్చదనాన్ని పెంచడానికి, కృత్రిమంగా అడవులను సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను, వెచ్చిస్తున్న వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సొంత రాబడులను పెంచుకుని ఆర్థిక స్వయంసమృద్ధి సాధిస్తున్న రాష్ర్టాలకు ప్రోత్సాహకంగా ఉండేలా ఫిస్కల్ రిలయన్స్ అనే అంశాన్ని చేర్చి 10% వెయిటేజీని ఇవ్వాలని కోరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను ఆర్థిక సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
నిధుల కేటాయింపులో ఆర్థిక సంఘాలు తీసుకుంటున్న వెయిటేజీ ప్రాతిపదిక రాష్ర్టాలకు తీవ్రనష్టం తెస్తున్నది. వెయిటేజీ ప్రాతిపదికను మార్చాలని ఎన్నిసార్లు విన్నవించినా అటు కేంద్రం కానీ ఇటు ఆర్థిక సంఘాలు కానీ అనుకూలంగా స్పందించడం లేదు. ఆర్థిక అంతరానికి జనాభా ఎక్కువ ఉన్న రాష్ర్టాలకు, ఆదాయం తక్కువగా ఉండి, లోటు బడ్జెట్ ఉన్న రాష్ర్టాలకు వాటా పెరిగింది. దీని ప్రకారం మన రాష్ర్టానికి మొత్తం పన్నుల రాబడిలో 2.33 శాతం నిధులు వస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక పురోగతి వేరే రాష్ర్టాల కంటే మెరుగ్గా ఉన్నందున పన్నుల్లో వాటా తగ్గిస్తున్నది. ప్రస్తుత సంవత్సరం 2.102%కి తగ్గింది. మొత్తం నిధుల్లో 0.228 పాయింట్లు తగ్గాయి. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాను 41నుంచి 50 %కి పెంచాలని తెలంగాణ కోరింది. ఇందుకోసం అవసరమైతే కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దుచేయాలని సూచించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమపథకాలకు ఊతమిచ్చినట్లవుతుందని పేర్కొన్నది. భవిష్యత్తులో ప్రజల అవసరాలకు ప్రభుత్వాలు వెచ్చించే ‘క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్’ ను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.