న్యూఢిల్లీ: చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పడిన క్వాడ్ (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) తొలి దేశాధినేతల సమావేశానికి ముందు ఇండియాపై మరోసారి ఏడుపు మొదలుపెట్టింది చైనా. అక్కడి అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ఇండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా ఒక ప్రతికూల ఆస్తిగా మారిందని విమర్శించింది. రష్యాతో కోల్డ్ వార్ సమయంలో అమెరికా ఏర్పాటు చేసిన నాటోలాగే ఇది కూడా ఉన్నదని, ఇది ఆసియా వెర్షన్ నాటో అని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. ఈ మధ్య ఇండియా అమెరికాకు దగ్గర అవుతుండటం వల్ల చైనా లీడ్ చేస్తున్న, రష్యా లీడ్ చేస్తున్న బ్రిక్స్, ఎస్సీవోలాంటి గ్రూపుల అభివృద్ధిపై ప్రభావం పడుతున్నదని, ఇది ఇండియా, చైనా సంబంధాలు, ఇండియా రష్యా సంబంధాలను దెబ్బ తీస్తున్నదని ఆ పత్రిక రాసింది.
బ్రిక్స్ను, ఎస్సీవోను ఓ ఆర్థిక వనరుగా వాడుకుంటూ, మరోవైపు సరైనా సహకారం ఇవ్వకుండా ఈ గ్రూపుల అభివృద్ధిని అడ్డుకునేలా ఇండియా వ్యవహరిస్తున్నదని ఆ పత్రిక ఆరోపించింది. ఈ ఏడాది ఇండియాలో బ్రిక్స్ సమావేశానికి చైనా సరే అని అన్నా కూడా తమ దేశ మంచితనాన్ని ఇండియా గుర్తించడం లేదని గ్లోబల్ టైమ్స్ విమర్శించింది. చైనాతో ఒంటరిగా పోటీకి దిగే సత్తా లేక తనలాంటి ఆలోచన ఉన్న దేశాల వైపు ఆశగా చూస్తోందని ఆరోపించింది. అమెరికాతో ఇండియా సంబంధాలు ఇలాగే కొనసాగితే ఇండో, పసిఫిక్ ప్రాంతంలో అమెరికా కుట్రలను అమలు చేసే దేశంగా ఇండియా మిగిలిపోతుందని కూడా గ్లోబల్ టైమ్స్ రాయడం గమనార్హం.