పరకాల : ఎమ్మెల్యే ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చల్లా ధర్మారెడ్డి నివాసంలో పరకాల నియోజకవర్గస్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. బీజేపీ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.
కాషాయం పార్టీ నాయకులు చిల్లర మాటలు మానుకోకపోతే ఎన్నికల్లో పట్టభద్రులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించి బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ‘బీజేపీ ఓట్ల కోసం యువతను మభ్యపెడుతుంది. కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. జిల్లాకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కావాలని ఉత్తర ప్రదేశ్కు తరలించింది. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం 150.05 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగిస్తే.. ఇప్పటివరకు స్థలం కేటాయించలేదని అనడం దారుణం. బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలి’ అని మంత్రి దయాకర్ రావు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండలస్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.