లక్నో : యజ్ఞవల్క్య స్మృతిని అనుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన(బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచ) వివాహాలను శాస్త్ర సమ్మతం చేశారు. వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్ర్తాలు ఆమోదించగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్ర్తాలు ఆమోదించలేదు. అయితే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ వివాహం మాత్రం ఈ ఎనిమిదింటిలో దేనికిందకు రాదు. అదో విచిత్రమైన వివాహం. ఈ వింత వివాహానికి గ్రామస్థులంతా సాక్ష్యంగా నిలిచారు. అజీమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అంబేద్కర్నగర్లో చోటుచేసుకున్న ఈ వివాహ వివరాలిలా ఉన్నాయి.
ఓ యువతి నలుగురు యువకులను ప్రేమించి వారితో కలిసి లేచిపోయింది. నలుగురు అబ్బాయిల్లోని ఒకరి బంధువు ఇంట్లో యువతిని ఉంచారు. అమ్మాయి ఆచూకీని కుటుంబ సభ్యులు కనుగొన్నారు. దీంతో నలుగురిపై ఫిర్యాదు చేసేందుకు కుటుంబం నిశ్చయించుకోగా ఇక్కడే గ్రామ పంచాయతీ రంగప్రవేశం చేసింది. అందరితో ఓ సమావేశం ఏర్పాటు చేసి అబ్బాయిలలో ఒకరిని వివాహం చేసుకోవాలని యువతికి, కుటుంబానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఉంచారు.
అమ్మాయి ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటుందని అడుగగా తాను ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతుందో నిర్ణయించుకోలేకపోయింది. దీంతో పంచాయతీ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. నలుగురు యువకుల పేర్లు వ్రాసి ఓ గిన్నెలో వేశారు. దాని నుండి ఓ కాగితాన్ని తీసుకోవాల్సిందిగా యువతికి సూచించారు. ఈ కాగితంలో పేరు ఉన్న వ్యక్తినే అమ్మాయి వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని ఖరారు చేశారు. సమ్మతి తెలిపిన యువతి చెప్పిన విధంగానే నాలుగు చిట్టీల్లో ఓ కాగితాన్ని తీసి వరుడిని ఎంచుకుంది.