న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి దేశంలో రెండు వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. అందులో ఒకటి సీరమ్కు చెందిన కొవిషీల్డ్ కాగా.. మరొకటి హైదరాబాద్లోని భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్. అయితే ఈ కొవాగ్జిన్ ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉండగానే దానికి డ్రగ్ కంట్రోలర్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన కొంత మంది ఈ వ్యాక్సిన్ను నిరాకరిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ కూడా కొవాగ్జిన్ తమకు వద్దని కేంద్రానికి లేఖ రాసింది.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ తమకు ఎందుకు వద్దో వివరిస్తూ ఛత్తీస్గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కేంద్రానికి లేఖ రాశారు. మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తి కాకపోవడం ఒక కారణమైతే.. వ్యాక్సిన్ సీసాలపై ఎక్స్పైరీ డేట్ లేకపోవడం మరో కారణంగా ఆయన చూపారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించే వరకూ కొవాగ్జిన్ను పంపవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు.
అయితే దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ఈ మేరకు చత్తీస్గఢ్ ప్రభుత్వానికి సవివరంగా ఒక లేఖ కూడా రాశారు. రాష్ట్రాలకు పంపించిన వ్యాక్సిన్లన్నీ పూర్తిగా సురక్షితమైనవే అని ఆయన అందులో స్పష్టం చేశారు. ఇక వ్యాక్సిన్ సీసాలపై ఎక్స్పైరీ తేదీ లేదు అన్నది పూర్తిగా అబద్ధమని, వాటిపై గడువు తేదీ ఉందంటూ దానికి సంబంధించిన ఫొటోను కూడా లేఖకు జతచేశారు. అంతేకాదు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చత్తీస్గఢ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని, వేగం పెంచాలని కూడా సూచించారు. దీనికోసం అందుబాటులో సరిపడినన్ని వ్యాక్సిన్లు ఉన్నాయని, దానిని మీరు అభినందించాలని కూడా చత్తీస్గఢ్ ఆరోగ్యమంత్రికి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.