‘మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో’ – అంటూ దాశరథి వాపోయారు. నేటికీ అక్షర సత్యంగా నిలుస్తూ మానవాళి ప్రస్థానం తీరును ప్రశ్నిస్తున్నాయి ఈ పలుకులు. ఉక్రెయిన్పై రష్యా నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా జరిపిన దాడిలో ఎంతమంది చిన్నారులు అసువులు బాసారో చూశాం. బాంబుల వర్షంలో ఉక్రెయిన్ పట్టణాలు నేలమట్టమై, శ్మశానాన్ని తలపిస్తున్న దారుణాల్ని గమనించాం. మూడు నెలల కింద మొదలైన ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకుండా కొనసాగుతుండగానే.. ప్రపంచ యవనికపై కొత్త ఘర్షణలు, సంక్షోభాలు నెలకొంటున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వాతావరణాన్ని అవి మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
చైనా దాడికి దిగితే తాము తైవాన్కు సైనికపరంగా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. దశాబ్దాలుగా తైవాన్కు ఆయుధాలను విక్రయిస్తున్నప్పటికీ.. దానిని చైనాలో అంతర్భాగంగానే అమెరికా అధికారికంగా పరిగణిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు బైడెన్ వ్యాఖ్య ఆ విధానానికి పూర్తి విరుద్ధం. ఇది అమెరికా-చైనా మధ్య ఎటువంటి ఘర్షణలకు దారితీస్తుందో తెలియదు. నాటోలో చేరుతామని స్వీడన్, ఫిన్లాండ్ చేసిన తాజా ప్రకటనపై టర్కీ, రష్యా భగ్గుమన్నాయి. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం నాటో కారణంగానే మొదలైన విషయం తెలిసిందే. అది సమసిపోవటం సంగతి అటుంచి కొత్త వివాదాలు నాటో కేంద్రంగా ముసురుకుంటున్నాయి. ఉత్తర కొరియా కవ్వింపులను ఎదుర్కోవటం కోసమంటూ దక్షిణకొరియా-అమెరికా భారీస్థాయిలో సైనిక విన్యాసాలు జరుపాలని నిర్ణయించాయి. అవసరమైతే అణ్వాయుధాలను కూడా మోహరిస్తామని అమెరికా ప్రకటించింది.
మన పొరుగుదేశాల పరిస్థితీ ఏమంత బాగా లేదు. శ్రీలంక ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయింది. నిత్యావసరాలు, ఇంధనం కూడా దొరక్క అల్లాడుతున్నారు లంకీయులు. పాకిస్థాన్లో ఇమ్రాన్ ప్రభుత్వం దిగిపోయి కొత్త సర్కారు అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ అనిశ్చితి రాజ్యమేలుతున్నది. ఈ విధంగా ప్రపంచమంతటా ఓవైపు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, అస్థిరత కొనసాగుతుంటే మరోవైపు వ్యాధులు విజృంభిస్తున్నాయి. కరోనా కోరల్లోంచి కొంతవరకు బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నామో లేదో మంకీపాక్స్ అనే కొత్త మహమ్మారి బయల్దేరింది. ఇది ఏ స్థాయిలో మానవాళిని వణికిస్తుందో తెలియదు. ఈ దురదృష్టకర పరిణామాల వల్ల ప్రపంచం రోజురోజుకీ అశాంతిలోకి, పేదరికంలోకి నెట్టివేయబడుతున్నది. ఆర్థిక అంతరాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఆక్స్ఫామ్ నివేదిక కళ్లకు కట్టింది. ఈ పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడేదెలా? అశాంతి, యుద్ధాలు, వ్యాధులు, పేదరికం స్థానంలో శాంతి, సహకారం, ఆరోగ్యం, అభివృద్ధి స్థాపన జరిగేదెలా? మానవాళి అడుగులు ఈ సానుకూల లక్ష్యాలను సాధించే దిశగా పడాలి. అప్పుడే యావత్ ప్రపంచం వసుధైక కుటుంబంలాగ వర్ధిల్లుతుంది.