జలదోపిడికి అలవాటుపడిన ఏపీ సర్కారు తీరు మారటం లేదు. తెలంగాణకు దక్కాల్సిన నదీజలాలను దశాబ్దాలుగా తరలించుకుపోయిన ఏపీ పాలకుల అలవాటు మారటం లేదు. కృష్ణా నదీజలాలపై కుయుక్తులు ఆగలేదు. కేంద్రజల(శక్తి)మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విషయంలోనూ దగాకు పాల్పడుతున్నది. వైఎస్ హయాంలో పదివేల క్యూసెక్కులు తీసుకెళ్తామని చెప్పి 40 వేల క్యూసెక్కులు తరలించగా, తాజాగా ఇప్పుడు జగన్ 80 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేందుకు ఉద్యుక్తులయ్యారు. రాజోలిబండ (ఆర్డీఎస్) కుడికాల్వ నిర్మాణాలు చేపడుతూ అన్ని నిబంధనలను అతిక్రమించటం గర్హనీయం.
కృష్ణానదిపై ఏపీ చేపడుతున్న అక్రమ నిర్మాణాల గురించి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికీ, ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది. వాటిని వెంటనే నిలిపేయాలని కోరింది. కానీ కేంద్రం అక్రమ ప్రాజెక్టులను ఆపకుండా చోద్యం చూస్తున్నది. రాష్ర్టాల మధ్య జలవివాదాలు తలెత్తినప్పుడు సకాలంలో జోక్యం చేసుకొని పరిష్కరించకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నది. ఇదే అలుసుగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను సాగిస్తున్నది. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో పైరుపచ్చల తెలంగాణ ఆవిష్కరణ కష్టసాధ్యమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. కృష్ణాలో మన వాటాను కచ్చితంగా వినియోగించుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నది. దీనికోసం కృష్ణా, భీమా నదులపై ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే పులిచింతల ఎడమకాల్వ నిర్మాణం, సుంకేశుల పరివాహంలో మరో లిఫ్ట్, భీమా నదికి వరదకాల్వ నిర్మాణాలతో పాటు, నాగార్జునసాగర్ టెయిల్పాండ్ దగ్గర కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణ జిల్లాల కరువును పారదోలేందుకు ప్రయత్నిస్తున్నది. న్యాయమైన వాటా నీటికోసమే తెలంగాణ అడుగుతున్నది. పొరుగు రాష్ట్రం ఏపీతో సుహృద్భావ ధోరణితో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంగా విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని ఆచరణాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయినా ఏపీ పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరే వ్యవహరిస్తూ, జలదోపిడికి పాల్పడటానికి ప్రయత్నించడం సహించరానిది.