ఆర్కేపురం : జిల్లా గ్రంథాలయ సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సోమవారం విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ సేవలు విస్తరిస్తామని తెలిపారు. ఇందులో భాగగంగా విద్యార్థులకు నేరుగా గ్రంథాలయ సేవలు అందించాలని మోడల్ ప్రాతిపదికన చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలోని హై స్కూల్ ప్రాగణంలో కంటైనర్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ప్రముఖ హై స్కూళ్లలో కంటైనర్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా ఏర్పడ్డ మండల కేంద్రాలలో, మునిసిపల్ కార్పొరేషన్లలో నూతన గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనే విషయాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది కొరత కారణంగా పొరుగు సేవల ద్వారా నియమించడానికై చర్చించినట్లు తెలిపారు.
మౌలిక వసతుల గురించి, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణం, ఇతర సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సందీప్ కుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పౌర గ్రంథాలయశాఖ సంచాలకులు శ్రీనివాసచారి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, వి.ఎన్.రాజు, శ్రీహరిశంకర్, యం.మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.