గంగారం, అక్టోబర్ 20 : అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన పోడు రైతులందరికీ హక్కు పత్రాలు అందేలా పారదర్శకంగా భూ సర్వేచేపట్టాలని కలెక్టర్ శశాంక ఎఫ్ఆర్సీలు, సర్వే బృందాలకు సూచించారు. గురువారం ఆయన గంగారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించి, చదవడం, రాయడంలో మెళకువలు నేర్పించారు. అనంతరం కోమట్లగూడెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేపట్టారు.
పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వైద్యసేవలు లేవని, ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందించాలని సూచించారు. గ్రామాల నుంచి ఎవరూ ప్రైవేటు దవాఖానలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిదేనన్నారు. అక్కడి నుంచి జడ్పీఎస్ పాఠశాలకు వెళ్లారు. తొలిమెట్టు యాప్ గురించి విద్యార్థులకు వివరించారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం తిర్మలగండిలో భూ సర్వేను పరిశీలించారు.
పారదర్శకంగా భూ సర్వే చేపట్టాలని, సాక్షాలు సరిగా ఉండేలా చూసుకోవాలని సర్వే బృందాలు, ఎఫ్ఆర్సీ కమిటీలకు సూచించారు. ఇప్పటికే చేపట్టిన కేత్రస్థాయి సర్వే ప్రక్రియను ఆన్లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో అబ్దుల్హై, తహసీల్దార్ సూర్యనారాయణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఈవో శ్రీదేవి, మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, రేంజర్ హజాహత్, సర్పంచ్లు చింత సారక్క, గొగ్గల సుగుణ, ఈసం రమ, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్, అక్టోబర్ 20 : జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల అవార్డుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలస్థాయిలో సిద్ధం చేసిన ప్రశ్నావళి ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. అవార్డుల ఎంపికలో ప్రాధాన్యత రంగాల్లో ప్రగతిని సూచించాలన్నారు. 113 ప్రశ్నలకు సంబంధించి ఆయా శాఖల సమాధానాలను సవివరంగా సమర్పించాలన్నారు.
పారామీటర్స్ ప్రకారం చేపట్టిన ప్రగతిని వివరించాలన్నా రు. పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, బాలల వికాసం, మహిళా సాధికారిత, పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, శుభ్రమైన తాగునీరు, గుడ్ గవర్నెన్స్, సామాజిక భద్రతకు సంబంధించి సమాధానాలను సంబంధిత అధికారులు, ఎంపీడీవోల సహకారంతో సరి చూసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమాదేవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, డీఎంహెచ్వో హరీశ్రాజ్, డీపీవో సాయిబాబా, జిల్లా సంక్షేమ అధికారి నర్మద, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవవోలు పాల్గొన్నారు.