స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటింది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని 75వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్విసప్తాహం పేరిట సోమవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇప్పటికే ఇంటింటికీ పంపిణీ చేసిన మూడు రంగుల జెండాలు సగర్వంగా ఎగురుతుండగా వజ్రోత్సవం సందర్భంగా ఓరుగల్లు కోటలోని ఖుష్మహల్ ప్రాంగణంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించగా, దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాకేంద్రాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా జరుపుకోగా ఎక్కడచూసినా దేశభక్తి వెల్లివిరిసేలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. జనగామ జిల్లాకేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, జిల్లా జడ్జి కె.శైలజ, డీసీపీ సీతారాం, తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సీపీ తరుణ్జోషి, మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, కుడా చైర్మన్ సుందర్రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, రుణ విమోచన సమితి అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహారు అనురాగ్శర్మ ముఖ్య అతిథిగా హాజరై జడ్పీ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎస్పీ సురేందర్రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ములుగు కలెక్టరేట్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు జెండా ఎగురవేశారు. మహబూబాబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్నాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లాకేంద్రంలోని ఖిలా వరంగల్లో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ గోపితో కలిసి జెండా ఆవిష్కరించారు.
వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీ దయాకర్ పాల్గొన్నారు. నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ జెండాల పంపిణీ, వనమహోత్సవం, ఫ్రీడం ర్యాలీలు, ఆటల పోటీలు, సమ్మేళనాలు.. ఇలా 14రోజుల పాటు తీరొక్క కార్యక్రమాలకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ గీతాలపై చేసిన నృత్యాలు అలరించాయి. అలాగే స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించి వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలిచ్చి సన్మానించారు.