ఉమ్మడి జిల్లాలోకి వచ్చీరాగానే బీజేపీ మూక రణరంగం సృష్టించింది. సాక్షాత్తూ స్వాతంత్య్ర దినోత్సవం రోజే హింసకు పాల్పడి టీఆర్ఎస్ నేతల రక్తం కళ్లజూసింది. పాదయాత్రలో బండిని ఎదురు ప్రశ్నించిన పాపానికి కాషాయ దండు కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్లతో వీరంగం చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు, సామాన్యులపై పిడిగుద్దులు కురిపిస్తూ దాడులకు తెగబడింది. దేవరుప్పుల మండల కేంద్రంలో సోమవారం కాషాయదండు చేసిన హల్చల్తో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
దేవరుప్పుల, ఆగస్టు 15 :పాదయాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్యాచ్ ఉమ్మడి జిల్లాలోకి వచ్చీరాగానే వీరంగం సృష్టించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కేంద్రంలోకి సోమవారం ప్రవేశించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర రణరంగాన్ని తలపించింది. యాత్రలో బౌన్సర్లు, రౌడీమూకలు పథకం ప్రకారం టీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడులు చేసినట్లు స్పష్టమవుతున్నది. సాక్షాత్తూ స్వాతంత్య్ర దినోత్సవం వేళ బండి యాత్ర హింసను ప్రేరేపించేలా సాగింది.
మండల కేంద్రంలో ఉదయం 11 గంటల వరకు ఓ పాఠశాలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్, జాతీయ రహదారి పక్కన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేవరుప్పుల దారిలో నిర్వహించిన సభలో బండి సంజయ్ జనాన్ని రెచ్చగొట్టే తరహాలో మాట్లాడారు. కేసీఆర్ పాలనను రజాకార్ల పాలనతో పోల్చిన బండి, కేసీఆర్ నిజాం రాజని, రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తున్నదని, రాష్ట్రంలో కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు.
ఇదే ప్రశ్నను సభకు దూరంగా ఉన్న టీఆర్ఎస్ నాయకుడు తిరిగి సంధిస్తూ కేం ద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని అడిగాడు. దానికి సమాధానం చెప్పాల్సిన సంజయ్ రెచ్చిపోయి ‘యూస్లెస్ఫెలో, స్టుపిడ్’ అని తిట్లదండకం అందుకున్నారు. ఇంతలోనే సభలో ఉన్న బీజేపీ కార్యకర్తలుగా చెప్పుకునే బౌన్సర్లు, గూండాలు ఒక్కసారిగా టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు రాళ్లు విసురుతూ, కర్రలతో వీధుల్లో ఉరుకుతూ దొరికినవారిని దొరికినట్లుగా విచక్షణా రహితంగా కొట్టారు. తన ఇంటి ముందు నిలబడిన మహిళను కొట్టడంతో ఆమె చెయ్యి విరిగింది.
దాడులతో టీఆర్ఎస్ కార్యకర్తల శరీరాలు రక్తసిక్తమయ్యాయి. వారిని స్థానికులు వెంటనే జనగామ దవఖానకు పంపారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో సంజయ్ మరింత రెచ్చకొట్టే ప్రసంగం చేస్తూ ఇటు కేసీఆర్ను అటు పోలీసులను దూషించారు. దాడుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు కోతి ప్రవీణ్, గనుపాక రమేశ్, గాదర శ్రీకాంత్, వడ్లకొండ శ్రీకాంత్, సాధారణ మహిళ గొడిశాల పద్మ గాయాలపాలయ్యారు.
దేవరుప్పుల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల రాస్తారోకో కొన్ని గంటల పాటు కొనసాగింది. కార్ల అద్దాలు పగులగొట్టారని బీజేపీ నాయకులు రోడ్డుపై బైటాయించారు. అదే సమయంలో దేవరుప్పులకు చేరుకున్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి కారును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. విషయం గ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు గంట పాటు శ్రమించి ఇరువర్గాలను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు