కవాడిగూడ : ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు మానవతాదృక్పథంతో ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వంద మంది పేదలకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఎస్ఆర్డీ సంస్థ ముషీరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా పేదలను ఆదకునేందుకు ఎంతో కృషి చేస్తున్నదని అన్నారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులకు కావాల్సిన పనిముట్లను ఉచితంగా అందజేశారని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉచితంగా ఆక్సిజన్ ఉత్పత్తిచేసే యంత్రాలు, బెడ్లు అందజేయడంతో పాటు విద్యార్థులకు 5 వేల మాస్కులు అందజేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఉపాధ్యక్షుడు బింగి నవీన్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఏ. శంకర్ గౌడ్, శ్రీ లక్ష్మీగణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఆరీపోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.