కొండాపూర్,మాదాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీటి సమస్యలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వరదనీరు చేరి సమస్యగా మారిన ప్రాంతాలను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వరద నీటి సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ పనులు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా నిత్యం ఎమర్జెన్సీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మాన్సూన్ బృందాలు విధులలో ఉంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఎదురైన సమ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటుగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సహయక చర్యలు చేపట్టాలన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లోని ఫలు కాలనీలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు ఈఈ శ్రీకాంతిని, శ్రీనివాస్, ఏఈ ప్రశాంత్, జగదీష్, జీహెచ్ఎంసీ ఏఈ ధీరజ్, ట్రాఫిక్ ఏసిపి హన్మంతరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.